1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (19:46 IST)

కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న వలసలు: రేవంత్‌తో ధర్మపురి సంజయ్ భేటీ

టీఆర్ఎస్, బీజేపీల నుండి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని బలపర్చడానికే తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నానని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. మంచి రోజు చూసుకొని పార్టీలో చేరతానన్నారు.
 
రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మాట్లాడిన సంజయ్..తన తండ్రి డీఎస్ కోసం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నానని చెప్పారు. కానీ అది కండువా కాదు.. గొడ్డలి అని తనకు తెలుసని అన్నారు. కాంగ్రెస్‌తో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీయే కాదన్నారు. కడుపులో కోపం ఉన్నా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తన తమ్ముడు ఏ పార్టీలో ఉంటే.. తనకేంటి అని అన్నారు.
 
బీజేపీకి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిపారు. బీజేపీని వీడడానికి అనేక కారణాలున్నాయన్నారు. వాటి వివరాలు త్వరలోనే చెబుతానని అన్నారు. మరో బీజేపీ నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు కూడా ఆ పార్టీని వీడనున్నారు. రేవంత్‌తో కలిసి టీడీపీలో పనిచేశానని.. మంచిరోజు చూసి.. నియోజక వర్గంలో సభ పెట్టి కాంగ్రెస్ లో చేరతామన్నారు.