మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (15:00 IST)

కోటప్పకొండకు కోడెల పరమభక్తుడు.. చిట్టడివి నుంచి పర్యాటక ప్రాంతంగా?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కోటప్పకొండకు అపర భక్తుడు. ఒకప్పుడు ముళ్లచెట్లతో నిండిన చిట్టడివిని తలపించే కోటప్పకొండ ప్రస్తుతం ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రదేశంగా మారిందంటే అందుకు కారణం కూడా కోడెల శివప్రసాదే. చుట్టుపక్కల ఊళ్ల నుంచి సెలవు రోజుల్లో భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళుతుంటారు. 
 
ఈ కొండపై ధ్యాన శివుడు, త్రిముఖ శివలింగం, విఘ్నేశ్వరుడు, లక్ష్మీనారాయణల భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మార్గ మధ్యలో చిన్నపిల్లలు, పెద్దవారు సేదదీరేలా ఒక పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి పనులు మొత్తం కోడెల హయాంలో జరిగినవే కావడం గమనార్హం. ఫలితంగా త్రికోటేశ్వరస్వామి ఆలయ ఆదాయం రూ.12 లక్షల నుంచి రూ.6కోట్లకు చేరింది. దీనికి తోడు కొండపై రోప్‌వేకు కూడా ఆయన ప్రయత్నించారు. కోడెల నరసరరావు పేట వచ్చిన ప్రతిసారి కనీసం ఒక్కసారి అయిన స్వామి దర్శనం చేసుకుంటారు.
 
మాజీ స్పీకర్‌ దివంగత కోడెల శివప్రసాదరావుకు కోటప్ప కొండపై వెలసిన త్రికోటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి. ఆయన హయాంలో కోటప్పకొండ రూపురేఖలే సమూలంగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. కొండపైకి వెళ్లేందుకు గతంలో మెట్ల మార్గం ఒక్కటే ఆధారం. దీంతో వృద్ధులు, గర్భిణులు కొండపైకి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడం కష్టంగా ఉండేది. దీంతో అక్కడ ఘాట్‌రోడ్డు నిర్మించాలని నాటి నరసరావుపేట శాసన సభ్యుడు కోడెల శివప్రసాద్‌ సంకల్పించారు. 
 
దీంతో రూ.66.50 లక్షల వ్యయంతో 1986 ఏప్రిల్‌ 9న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుతో శంకుస్థాపన చేయించారు. కానీ, పరిస్థితులు మారడంతో ఆ రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 1997లో మరోమారు రూ.2.24 కోట్ల వ్యయంతో రోడ్డు పనులను ప్రారంభించి 1999 నాటికి పూర్తి చేయించారు. ఇలా కోటప్పకొండను వయోపరిమితి లేకుండా అందరూ దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారు కోడెల శివప్రసాద్.