గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (16:25 IST)

అభినందన్ యుద్ధ ఖైదీనా? బగ్ టెస్ట్, సైక్ టెస్ట్, మిషన్‌పై ఆరా

పాకిస్థాన్ ఆర్మీకి చిక్కి ప్రాణాలతో బయటపడుతున్న భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్. ఈయన్ను ప్రస్తుతం పాకిస్థాన్ యుద్ధ ఖైదీగా భారత్‌కు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జెనీవా ఒప్పందం మేరకు పాకిస్థాన్ కేవలం 24 గంటల్లోనే అభినందన్ అప్పగింతపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అభినందన్‌ను అప్పగించిన తర్వాత అంటే ఒక యుద్ధ ఖైదీ స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో సైనిక పరమైన ప్రక్రియను నిర్వహిస్తారు. ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో పరిశీలిద్ధాం. 
 
అభినందన్ స్వదేశీ గడ్డపై అడుగుపెట్టగానే ఆయన్ను నేరుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఆయనకు దేహదారుఢ్యం, పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం కొన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు.. అనేక రకాల స్కాన్‌లు తీస్తారు. అంటే, అభినందన్ శరీరంలో పాకిస్థాన్ ఏమైనా రహస్య పరికాలు అమర్చిందా అని తెలుసుకునేందుకు ఈ తరహా పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఆ తర్వాత అభినందన్‌కు మానసిక పరీక్షలు నిర్వహిస్తారు. శత్రువుల చెరలో అతను ఉండటం, కొన్ని రోజుల పాటు షాక్‌లో గడపడం వల్ల శత్రు దేశం మన రహస్యాలను తెలుసుకోవడానికి అతన్ని హింసించిందా అనే కోణంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కూడా అతన్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. 
 
నిజానికి ఒక దేశం నుంచి యుద్ధ ఖైదీగా స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో తమ పైలట్‌ను విచారించడానికి ఐబీ లేదా రాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎయిర్‌ఫోర్స్ అనుమతించదు. కానీ, అభినందన్ కేసును అరుదైన కేసుగా పరిగణిస్తున్నందున ఈ విచారణ తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా తన మిషన్ గురించి సమాచారం శ‌త్రువుల‌కు ఇచ్చాడా లేదా అన్నది అభినందన్ నుంచి రాబడతారు. 
 
ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ ఈ పని చేస్తుంది. అతను పాకిస్థాన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుసు కాబట్టి.. ఓ ప్రామాణిక ప్రక్రియను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఆ అధికారి స్పష్టంచేశారు. ఒకవేళ అభినందన్ తన శారీరక, మానసిక ఫిట్నెస్‌ను నిరూపించకపోతే.. భవిష్యత్తులో అతడు ఆఫీస్ పనికే పరిమితం కావాల్సి ఉంటుందని ఆ అధికారి చెప్పడం విశేషం.