శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:02 IST)

శుక్రవారం స్వదేశానికి అభినందన్.. శాంతిని కోరుకుంటున్నాం.. అందుకే?

ప్రాణాలకు తెగించి పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాన్ని తరిమికొట్టే క్రమంలో నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌కు చిక్కిన మన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయాలని దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ విషయంగా భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది.


ఏది ఏమైనా తమ కమాండర్‌ను సురక్షితంగా అప్పగించాలని ఈ విషయంలో ఎటువంటి డీల్‌లకు కానీ ప్రలోభాలకు కానీ తలొగ్గేది లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
 
ఈ నేపథ్యంలో తమకు బంధీగా చిక్కిన భారత కమాండర్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయబోతున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం పార్లమెంటులో ప్రకటించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని ఇందుకు సూచనగానే అతడిని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ చర్యను భారత్ పాక్‌ల మధ్య చర్చలకు మొదటి అడుగుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.
 
పుల్వామా దాడికి సంబంధించి పాకిస్థాన్ డిప్యూటీ హైకమీషనర్‌కు భారత్ అందజేసిన సాక్ష్యాధారాలు తనకు అందాయని, ఈ నేపథ్యంలో తాను నరేంద్ర మోదీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే అభినందన్‌ను శుక్రవారం సాయంత్రంలోగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.