శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (16:52 IST)

అభినందన్ అప్పగింతకు పాకిస్థాన్ సమ్మతం

కోట్లాది మంది భారత ప్రజల ప్రార్థనలు ఫలించాయి. శత్రుసైన్యం చేతిలో బందీగా ఉన్న భారత వైమానిక దళం విగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ సమ్మతం తెలిపింది. అభినందన్‌ను శుక్రవారం భారత్‌కు అప్పగిస్తామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తాము యుద్ధం కంటే శాంతిని కోరుకుంటున్నామన్నారు. ఈ నిర్ణయం పాకిస్థాన్ విశాల హృదయాన్ని తెలియజేస్తుందన్నారు. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్ మొహ్మద్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడులను ఓర్చుకోలేని పాకిస్థాన్.. భారత్‌పై ప్రతీకారదాడులకు దిగింది. వీటిని భారత్ తిప్పికొట్టింది. 
 
అదేసమయంలో పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చిన భారత మిగ్ ఫైటర్ జెట్ కమాండర్ అభినందన్ వర్దమాన్ నడిపిన మిగ్ విమానం కూలిపోయింది. కానీ పారాచూట్ సాయంతో అభినందన్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఆయన పాకిస్థాన్ భూభాగంలో దిగాడు. దీంతో పాకిస్థాన్ సైనికులు ఆయన్ను బందీగా పట్టుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం ప్రకటించింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకి చేసింది. భారత్ చర్యలను అనేక దేశాలు సమర్థించాయి. పైగా, ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్న ధ్వంసం చేయాల్సిందేనంటూ అంతర్జాతీయ సమాజం నొక్కివక్కాణించింది. దీనికితోడు బందీగా ఉన్న భారత పైలట్ అభినందన్‌ను తక్షణం విడుదల చేయాలని పాక్‌పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా శుక్రవారం ఆయన్ను అప్పగించేందుకు శత్రుదేశం పాకిస్థాన్ సమ్మతించింది.