1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: సోమవారం, 10 మే 2021 (20:21 IST)

కరోనా తీవ్రత జూలై 20 వరకు బలీయమే: స్వరూపానందేంద్ర స్వామి

అమ‌రావ‌తి : ఈ ఏడాది జూలై 20వ తేదీ వ‌ర‌కు క‌రోనా తీవ్ర‌త బ‌లీయంగానే ఉంటుంద‌ని విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తులు శ్రీ శ్రీ శ్రీ స‌ర్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి మ‌హాస్వామి తెలిపారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్‌ 13వ తేదీన) స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. కరోనా తీవ్రత ఎలా ఉండబోతుందన్న అంశంపై స్పష్టమైన విశ్లేషణ చేశారు.

ఈ ఏడాది అన్ని గ్రహాలు రాహువు- కేతువు మధ్యలో ఉన్న కారణంగా ఇబ్బందికరమైన సంవత్సరమే అవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. కుజుడు కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పవని తెలిపారు. జూలై 20వ తేదీ వరకు కరోనా మహమ్మారి బలంగా ఉంటుందని విశ్లేషించారు. కరోనా తీవ్రత ఎప్పటికి తగ్గుతుందనేది ఆ తర్వాతే నిర్ణయం చేయాలి తప్ప, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

ఇటీవ‌లి కాలంలో స్వ‌రూపానందేంద్ర స్వామి పంచాంగ విశ్లేష‌ణ‌ను కొంద‌రు సోష‌ల్ మీడియాలో అస‌త్యంగా ప్ర‌చారం చేస్తుండ‌టాన్ని విశాఖ శ్రీ శార‌దాపీఠం ఖండించింది. పీఠాధిప‌తుల విశ్లేష‌ణ‌కు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ లింక్ ద్వారా విడుద‌ల చేశారు.