శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (20:31 IST)

దిశ హత్య కేసు: నేరస్తులను 'మహానది' సింగిల్ సెల్‌కు తరలించిన పోలీసులు, ఏమిటీ సింగిల్‌ సెల్‌?

ప్రమాదకరంగా ఉండే రిమాండ్‌ ఖైదీలతో పాటు జైలు సిబ్బందితో గొడవపడే ఖైదీలను సింగిల్‌ సెల్స్‌కు మార్చడం చర్లపల్లి జైలులో తరచూ జరిగే పరిణామమే. తోటి ఖైదీల నుంచి హాని ఉన్న ఖైదీలను కూడా ఈ సింగిల్‌ సెల్స్‌కు మారుస్తుంటారు. పశువైద్యురాలిపై పైశాచికత్వం ప్రదర్శించిన నలుగురు నిందితులను ఈ కారణంతోనే సింగిల్‌ సెల్‌కు మార్చారు. 
 
చర్లపల్లి జైల్లో ఖైదీలను ఉంచేందుకు మూడు అంతస్తుల్లో మూడు బ్యారక్‌లు ఉంటాయి. ఒక్కో బ్యారక్‌లో నాలుగు నుంచి ఎనిమిది హాళ్లుంటాయి. ఒక్కో హాల్‌లో 16 నుంచి 30 మంది దాకా ఖైదీలుంటారు. జైలు వేళల్లో వారికి కేటాయించిన పనులు చేసుకొని వచ్చే ఖైదీలు ఈ హాళ్లలోనే నిద్ర పోతుంటారు. సింగిల్‌ సెల్స్‌ వీటికి భిన్నంగా ఉంటాయి. వీటిలో ముందువైపు తలుపునకు కటకటాలు, వెనక వైపు దాదాపు 13 అడుగుల ఎత్తులో ఒక వెంటిలేటర్‌ మాత్రమే ఉంటాయి. 
 
అందులోనే ఒక మూల కాలకృత్యాలు తీర్చుకునేందుకు వీలుగా గోడచాటుగా ఉండే బాత్‌రూం మాత్రమే ఉంటుంది. జైలులోని ఇతర విషయాలేవీ వీరికి తెలిసే అవకాశం ఉండదు. సమయానికి టిఫిన్‌, టీ, భోజనం మాత్రం అందిస్తారు. చీకటి కొట్టులాంటి సింగిల్‌ సెల్‌లోని ఖైదీలు ఎలాంటి అఘాయిత్యానికి, ఆత్మహత్యా యత్నానికి పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. 
 
స్పూను, గ్లాసు, ప్లేటు లాంటివే కాకుండా బాత్‌రూంలో కనీసం బకెట్‌ కూడా ఉండకుండా చూస్తారు. కారిడార్‌లో ఉండే విద్యుత్‌ దీపమే వారికి రాత్రి వేళ గుడ్డి వెలుగునిస్తుంది. ప్రస్తుతం నిందితులు ఉన్న మహానది బ్యారక్‌లోని సింగిల్‌ సెల్స్‌లోనే గతంలో మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓంప్రకా‌ష్‌ను ఉంచారు.