సంబంధిత వార్తలు
- డాలర్ శేషాద్రి మృతి తరని లోటు... ధన్యజీవి: చంద్రబాబు, వైవీ సుబ్బారెడ్డి
- డాలర్ శేషాద్రి హఠాన్మరణం టీటీడీకే కాదు, అందరికీ లోటు!
- కార్తీక దీపోత్సవం నాడు తిరుమల డాలర్ శేషాద్రి హఠాన్మరణం
- తిరుపతి రెండో ఘాట్ రోడ్డును పరిశీలించిన టిటిడి ఈఓ
- గో ఆధారిత రైతులకు ఆవులు, ఎద్దులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయండి : టీటీడీ ఈవో
డాలర్ శేషాద్రి తన డాలర్ను ఆ అధికారికి ఇచ్చారట, తన మరణం ముందే తెలిసిపోయిందా?
నా జీవితంలో ఈరోజు చాలా విచారకరమైన రోజు. 2004 సంవత్సరం నుంచి నేటివరకు శేషాద్రి స్వామితో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని కంటతడి పెట్టారు తిరుమల టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి.
డాలర్ శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు, నిర్వహణ తప్ప మరో ధ్యాస అనేది లేని గొప్ప క్రమశిక్షణ శేషాద్రి స్వామిదన్నారు.
శ్రీవారి ఆలయ నిర్వహణ, సేవలు, ఉత్సవాలపై విపులంగా శేషాద్రి స్వామి ఐదు సంపుటాలు రచించారు. రెండు సంపుటాలు ముద్రణ పూర్తయ్యింది. మిగిలిన మూడు సంపుటాలు త్వరలో ముద్రిస్తామన్నారు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వైజాగ్ ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని హెచ్చరించాను.
స్వామివారి కార్తీక దీపోత్సవాన్ని భక్తకోటికి అందించి, సమాజంలో భక్తి ప్రపత్తులు పెంచాలని బాధ్యత ఉందని చెప్పి డాలర్ శేషాద్రి వైజాగ్ వెళ్ళినట్లు చెప్పారు. స్వామివారి సేవలో ఉన్నప్పుడే నా తుదిశ్వాస పోవడం కంటే భాగ్యం ఏముంటుందని శేషాద్రి స్వామి అన్నట్లు చెప్పారు.
తన మెడలోని డాలర్, డాలర్కు ఉన్న బంగారు గొలుసంటే శేసాద్రి స్వామికి ఎంతో ఇష్టమని.. నా తదనంతరం ఈ డాలర్ గొలుసును స్వీకరించాలని శేషాద్రి స్వామి తనకు అందజేశారన్నారు. పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శేషాద్రి స్వామి దైవసానిధ్యం చేరుకున్నారని, నిష్పక్షపాతంగా, స్వలాభం లేకుండా స్వామి సేవ చేశారు కాబట్టే ఆయన ప్రశాంతంగా పరమపదించినట్లు చెప్పారు.
రేపు జరగబోయే శేషాద్రి స్వామి అంతిమ సంస్కారాలకు టిటిడి ఛైర్మన్, ఈఓ హాజరవుతారని.. భౌతికంగా ఆయన మనతో లేరన్న బాధ ఒకింత ఉన్నప్పటికీ తన అపారమైన అనుభవ జ్ఞానంతో అందజేసిన ఆలయ నిర్వహణ సంపుటాలు మనతోనే ఉన్నాయన్నారు.
