శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (11:47 IST)

అమ్మ జన్మనిస్తే.. డాక్టర్లు పునర్జన్మనిస్తారు : నేడు డాక్టర్స్ డే

అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వైద్యులను ప్రత్యక్ష దేవుళ్లుగా భావిస్తారు. అలాంటి వైద్యుల సేవలను గుర్తు చేసుకునేందుకు వీలుగా ప్రతి యేడాది జూలై ఒకటో తేదీని డాక్టర్స్ డేగా పాటిస్తూ వస్తున్నారు. ఈ 'జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుని వైద్యరంగంలోని ప్రతి ఒక్క వైద్యుడుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
ఈ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేతలు తమ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. నిజానికి వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవిస్తారు. అలాంటిది మన సంస్కృతి. వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరాయంగా నిస్వార్థ సేవలు అందిస్తున్న వైద్యులందరికీ ఈ సందర్భంగా ప్రణామాలు అర్పిస్తున్నాను అని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ట్వీట్ చేశారు.
 
'కోవిడ్ మహమ్మారి వైద్యులు, వారి కుటుంబ సభ్యుల మీద తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. అయినా వారు చిత్తశుద్ధితో తమ కర్తవ్యాన్ని  కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ, వైద్యులపై ఒత్తిడిని తగ్గించాలని ఆకాంక్షిస్తున్నాను' అని వెంక‌య్య నాయుడు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  
 
జాతీయ వైద్యుల దినోత్సవం సంద‌ర్భంగా వైద్యులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. వైద్య రంగంలో భార‌త్ బాగా పురోగ‌మించ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని చెప్పారు. ప్ర‌పంచం ఆరోగ్య‌క‌రంగా ఉండ‌డానికి త‌న వంతు కృషి చేస్తోంద‌న్నారు. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు న‌డ్డా, ఆ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా డాక్ట‌ర్స్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
అమ్మ మనకు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారు. కరోనా పై పోరాటంలోమన డాక్టర్లు చూపుతున్న అంకితభావం,త్యాగనిరతి అద్భుతమైనవి. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలనే పణంగా పెడుతూ సైనికుల్లా పనిచేస్తూన్న వైధ్యులందరికి, డాక్టర్స్ డే శుభాకాంక్షలు. వీరికి అండగా ఉండటం మన బాధ్యత అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 
 
జాతీయ వైద్యుల దినోత్సవం సంద‌ర్భంగా వైద్యులంద‌రికీ సెల్యూట్ చేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. మ‌న జీవితాల‌ను కాపాడగ‌లిగేది వైద్యులు మాత్ర‌మేన‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. 'వైద్యోనారాయ‌ణోహ‌రి.. స‌ర్వ‌శ‌క్తిమంతుడైన దేవుడి ప్ర‌తిరూపాలే వైద్యులు. ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభ ప‌రిస్థితుల్లో ఈ విష‌యం మ‌రోసారి రుజువైంది. వైద్యుల‌ ప‌ట్ల ఎప్ప‌టికీ కృత‌జ్ఞ‌త క‌లిగి ఉంటాం' అని చిరంజీవి అన్నారు.  
 
'ప్రాణ ర‌క్ష‌కులు.. అన్ని వేళ‌లా గొప్ప హీరోలు డాక్ట‌ర్లు. మాన‌వాళి సంక్షేమం కోసం మీరందిస్తోన్న సేవ‌లు, మీ నిబ‌ద్ధ‌త‌ అసమానమైనవి. వైద్యులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను' అని సినీ హీరో మ‌హేశ్ బాబు పేర్కొన్నారు.