శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 మే 2020 (15:49 IST)

నాగబాబు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందన...

ఈమధ్య కాలంలో నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తీవ్ర చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు.

ట్విట్టర్ ద్వారా ఆయన... ''జనసేన పార్టీలో వున్న నాయకులు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారివారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని మీకు తెలిపాం. 
 
ఈ మధ్యకాలంలో కూడా కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున మరోసారి ఈ విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాను. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ నాగబాబు గారు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. 
 
పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికార పత్రం ద్వారా పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే వున్నాము. వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరికీ ఒకమాట చెబుతున్నా... ఇది ప్రజలు అనుకోని కష్టాలను ఎదుర్కొంటున్న కాలం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని కోరుతున్నాను. క్రమశిక్షణ అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను.''