1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (22:14 IST)

Work From Home పెద్ద గుదిబండ: 90 శాతం మంది ఉద్యోగులకి అలాంటి ఇబ్బంది

కరోనావైరస్ దెబ్బకి చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్నిచ్చాయి. మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే హాయిగా ఇంట్లోనే పిల్లాపాపల మధ్య ఫ్యాను కింద కూర్చుని పనిచేసుకోవచ్చులే అనుకున్నవారంతా ఇప్పుడు, ఆఫీసుకు ఎపుడెపుడు వెళ్దామా అని అనుకుంటున్నారు. దీనికి కారణం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారిలో 90 శాతం మందికి పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయట. ఈ విషయాన్ని హర్మన్ మిల్లర్ అనే ఆఫీస్ ఫర్నీచర్ తయారీ సంస్థ సర్వే చేసిన పిదప తెలియజేసింది.
 
లాక్ డౌన్ విధించిన తర్వాత సాధారణ పనిగంటలు పెరిగిపోయాయి. కనీసం 20 శాతం మేర అధికంగా కూర్చుని పనిచేస్తున్నట్లు తేలింది. ఫలితంగా 90 శాతం మందిలో మానసిక ఒత్తిడి, శారీరక నొప్పులతో సతమతం అవుతున్నారట.
 
ఇంకా 39.4 శాతం మందికి మెడనొప్పి ఇబ్బందిపెడుతుంటే 53 శాతం నడుము నొప్పితో సతమతం అవుతున్నారట. 44 శాతం మందికి రాత్రిపూట నిద్రపట్టక గిలగిలలాడుతున్నట్లు తేలింది. 34 శాతం మంది చేతుల నొప్పులు, 33 శాతం మంది కాళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. సుమారు 27 శాతం మంది తలనొప్పి, కళ్లు లాగటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మొత్తమ్మీద లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉద్యోగులకు గుదిబండలా మారిందని సర్వేలో తేలింది.