1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 13 డిశెంబరు 2021 (11:45 IST)

ఆ ప్రశ్నకు సమాధానమే హర్నాజ్ సంధుకి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తెచ్చిపెట్టింది

చండీగఢ్‌కు చెందిన 21 ఏళ్ల మోడల్ హర్నాజ్ సంధు సోమవారం మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని గెలుచుకుంది. ఇంతకుముందు, లారా దత్తా 2000లో టైటిల్‌ను గెలుచుకోగా, సుస్మితా సేన్‌కి 1994లో కిరీటాన్ని కైవసం చేసుకుంది.
సంధుకు మెక్సికోకు చెందిన మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా కిరీటాన్ని అందజేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

 
మొదటి రన్నరప్‌గా మిస్ పరాగ్వే, రెండో రన్నరప్‌గా మిస్ సౌత్ ఆఫ్రికా నిలిచారు. మిస్ ఇండియా హర్నాజ్ కౌర్ సంధును విజేతగా స్టీవ్ హార్వే ప్రకటించగానే, స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. హర్నాజ్ కౌర్ సంధు తన పేరును విజేతగా ప్రకటించిన వెంటనే ఆనంద బాష్పాలతో ఉద్వేగానికి లోనైంది. సోమవారం ఉదయం పోటీ ప్రారంభమైనప్పుడు, హర్నాజ్ మొదట్లో టాప్ 16లో వుంది. స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత ఆమె టాప్ 10లో భాగమైంది.

 
ప్రశ్నోత్తరాల చివరి రౌండ్‌లో, హర్నాజ్ యువతులకు మీ సలహా ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, తమను తాము విశ్వసించమని చెప్పింది. ఆమె మాట్లాడుతూ, "ఈనాటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఒత్తిడి, తమను తాము విశ్వసించుకోవడం. మీరు ప్రత్యేకమైనవారని తెలుసుకోవడం మిమ్మల్ని అందంగా తయారుచేస్తుంది. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.

 
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరిన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. బయటకు రండి, మీ కోసం మాట్లాడండి, ఎందుకంటే మీరు మీ జీవితానికి నాయకులు, మీరు మీ స్వంత స్వరం, నేను నన్ను నమ్ముకున్నాను. అందుకే నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను." అని చెప్పడంతో కిరీటం ఆమె కైవసం అయ్యింది. ప్రతి రౌండ్‌లోని పాయింట్లను లెక్కించి చివరికి ఓట్లను లెక్కించారు. దీని తర్వాత, హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని గెలుచుకుంది.