శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (16:24 IST)

నిర్భయ దోషుల పట్ల దయలేదు.. ఉరితీయాల్సిందే : సుప్రీంకోర్టు

నిర్భయ దోషులకు ఏ క్షణమైనా ఉరిశిక్షలు అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకుంటే.. తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ ముద్దాయిలు పెట్టుకున్న పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి, వాటిని తోసిపుచ్చింది. దీంతో నిర్భయ దోషులకు ఎపుడైనా ఉరిశిక్షలను అమలు చేసే అవకాశం ఉంది. 
 
నిజానికి ఈ నలుగురు దోషులను ఉరితీయాల్సిందిగా ఢిల్లీ పాటియాలా కోర్టు ఇటీవలే డెత్ వారెంట్‌ను జారీ చేసింది. అయితే, ముద్దాయిల్లో ఇద్దరైన విజయ్ శర్మ, ముఖేష్‌లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం... వారి పిటిషన్లను తిరస్కరించింది. ఫలితంగా మరో వారం రోజుల్లో వీరిని ఉరి తీయబోతున్నారు.
 
మరోవైపు, తనను ఉరి తీస్తే తన కుటుంబం మొత్తం నాశనమవుతుందని పిటిషన్‌లో వినయ్ శర్మ పేర్కొన్నాడు. తన తండ్రి సంపాదన కుటుంబ పోషణకు సరిపోదని, తన కుటుంబానికి సేవింగ్స్ కూడా లేదని చెప్పాడు. ఆర్కేపురంలోని హరిజన్ బస్తీలో తన కుటుంబం ఉంటుందని తెలిపాడు. అయితే, వీరి విన్నపాలను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. అత్యంత దుర్మార్గానికి ఒడిగట్టన ఈ మానవ మృగాలను ఉరి తీయడమే సరైనదని తీర్పును వెలువరించింది.
 
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఈనెల 22న ఉదయం 7 గంటలకు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లను ఉరి తీయబోతున్నారు. కేసులో ఐదో దోషి అయిన రామ్ సింగ్ 2013 మార్చి నెలలో జైల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే.