శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (09:17 IST)

భారత్‌లో ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ : సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో

అమెరికాకు చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అస్ట్రాజెనికా ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కరోనా వ్యాక్సిన్ తొలి మానవ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన మరుసటి రోజున, భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ అనుమతులు పొందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. 
 
ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్ లో 50 శాతం ఇక్కడే వినియోగిస్తామన్నారు. భారత్ నుంచి 60 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి అవుతుందని, ఇండియాలో ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి, ప్రజలకు ఉచితంగా అందిస్తుందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగానే ఇది జరుగుతుందని పూనావాలా స్పష్టం చేశారు.
 
ముఖ్యంగా, భారత్‌లో తయారు చేసే వ్యాక్సిన్‌లో 50 శాతం దేశీయంగానే వినియోగిస్తామన్నారు. మరో 50 శాతాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు. అది కూడా ప్రతి నెలా తయారయ్యే వ్యాక్సిన్ పరిమాణం ఆధారంగా ఉంటుంది. భారత ప్రభుత్వం మాకెంతో మద్దతుగా నిలుస్తోంది. ఇది ప్రపంచ కష్టమన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ వ్యాక్సిన్ అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రపంచం మొత్తానికి మనం రక్షణ కల్పించాలి అని చెప్పుకొచ్చారు.
 
అయితే, తొలి దశ వ్యాక్సిన్‌ను ఎవరికి ఇవ్వాలన్న విషయంలో మాత్రం కేంద్రానిదే తుది నిర్ణయమన్నారు. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను 2 నుంచి 3 డాలర్ల లోపే (సుమారు రూ.150 నుంచి రూ.230లోపు) అందించాలన్న నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. అలాగే, ఈ ధర భారత్‌లో రూ.వెయ్యిగా ఉండొచ్చని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.