1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (17:29 IST)

వైసిపి ముఖ్య నేత నుంచి రోజాకు ఫోన్.. సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఇస్తున్నారా?

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఆనందానికి అవధుల్లేవట. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగనున్న నేపథ్యంలో వైసిపి ముఖ్య నేత నుంచి ఆమెకు ఫోన్ వచ్చిందట. ఏప్రియల్ 2వ తేదీన మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టడానికి సిద్థంగా ఉండమని చెప్పారట. దీంతో రోజా ఎగిరిగంతేసేంత పని చేశారట. మంత్రి పదవి ఇక ఖాయమని అనుచరులకు చెప్పేశారట. మంత్రి పదవి ఖాయమే కానీ ఏ శాఖ అన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదని తెలుస్తోంది.

 
అయితే మొదట్లో తను మంత్రిని కాకుండా అడ్డుపడిన కొంతమంది శత్రువులు ఇప్పుడు మిత్రులయ్యారంటూ సంతోషంలో ఉన్నారట. ఎపిఐఐసి ఛైర్ పర్సన్‌గా కొన్నినెలల పాటు రోజా పనిచేశారు. కానీ ఆ తరువాత ఆ పదవి నుంచి కూడా సిఎం పక్కకు తప్పించేసిన విషయం తెలిసిందే. దీంతో రోజాతో పాటు ఆమె అనుచరులు కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే ఎపిఐఐసి పదవి నుంచి తీసేసినా సరే ఆ తరువాత మంత్రి పదవి వస్తుందన్న ధీమాలో ఉన్నారు రోజా.

 
కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నిత్యం రోజా ప్రజల మధ్యే ఉంటోందని సిఎం దృష్టికి వెళ్ళిందట. అందులోను ప్రతిపక్షాలకు దీటుగా సమాధానాలిచ్చే రోజాకు ఒక అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావించారట. దీంతో ఎవరు చెప్పినా సరే పట్టించుకోకుండా ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట. ఈ నెల 27వ తేదీన కొంతమంది మంత్రులు రాజీనామా చేస్తుంటే ఏప్రియల్ 2వ తేదీ రోజా మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నగరిలో సంబరాలు చేసుకోవాలని అభిమానులు, కార్యకర్తలు అప్పుడే సిద్దమయ్యారట. 

 
రోజాకు ఫోన్ రాగానే అప్పుడే ఉగాది పండుగ వచ్చేసిందన్న ఆనందంలో ఆమె వెళ్ళిపోయారు. తనకు బాగా సన్నిహితులైన కార్యకర్తలను పిలిచి ఇదే విషయం చెప్పారట ఆమె. నిరాశ, నిస్పృహలో ఉన్న కార్యకర్తలందరూ ఒక్కసారిగా ఆనందంలోకి వెళ్లిపోయారట. ఎప్పుడెప్పుడు రోజా మంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం రోజాకు సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.