1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 జూన్ 2022 (19:06 IST)

సత్యసాయి జిల్లాలో చెప్పుతో కొట్టుకున్న గ్రామ వాలంటీర్, ఎందుకో తెలుసా?

volunteer
సత్యసాయి జిల్లాలో కదిరి మండలంలోని రామదాస్ నాయక్ తండాలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న నగేష్ నాయక్ అనే వ్యక్తి తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు. పంటల బీమా సొమ్మును మొత్తం నువ్వే తినేసావా అని రైతులు నిలదీయడంతో ఆ పని చేసాడు నగేష్.

 
వివరాల్లోకి వెళితే... ఇ-క్రాప్ బుకింగ్ చేసిన రైతులకు ఇటీవలే పంటల బీమా సొమ్మును జమ చేసారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఐతే తన పరిధిలోని 50 మంది రైతుల ఖాతాల్లో సొమ్ము పడకపోయేసరికి అంతా కలిసికట్టుగా నగేష్ వద్దకు వచ్చారు.


తమకు జమ పడాల్సిన సొమ్మును స్వాహా చేసావా అంటూ నగేష్ ను నిలదీయడంతో అతడు ఆగ్రహం చెందాడు. వెంటనే వాళ్లందర్నీ వెంటబెట్టుకుని గ్రామ సచివాలయానికి వచ్చాడు. అక్కడ సచివాలయ ఉద్యోగులను పంటల బీమా సొమ్ము గురించి నిలదీశాడు. అక్కడే వున్న వ్యవసాయ అధికారి సైతం నగేష్ అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేకపోయాడు.

 
దీనితో నగేష్ తన చెప్పును తీసుకుని కొట్టుకుంటూ.. ఈ ఉద్యోగం వద్దూ ఏమీ వద్దు. వీరికి డబ్బులు పడ్డాక తన గ్రామ వాలంటీర్ పదవికి రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. రైతులందరూ బీమా సొమ్మును తానే తినేసినట్లు మాట్లాడుతున్నారనీ, ఇంతకంటే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిదని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.