సోమవారం, 21 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి - పోలీసుల అదుపులో నిందితుడు

deadbody
కడప జిల్లా బద్వేల్ సమీపంలో పెట్రోల్ దాడికిగురైన ఇంటర్ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె కడప రిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది. శనివారం విద్యార్థిని పై ప్రేమోన్మాది విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరడం వల్లే దాడి చేశాడని పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. కడప రిమ్స్ బాధితురాలి నుంచి జడ్జి వాంగ్మూలం తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే విఘ్నేష్ నిప్పంటించినట్లు బాలిక తెలిపింది.
 
స్నేహితుడి ముసుగులో విఘ్నేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కలవడానికి రమ్మని చెప్పి... పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపిన మేరకు.. బాధిత బాలిక (16) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. 
 
కడపలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న విఘ్నేష్‌తో చిన్నప్పటి నుంచీ స్నేహం ఉంది. అతడికి వివాహం కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి ఫోన్ చేసి శనివారం తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాంతో ఆ బాలిక శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేష్ మధ్యలో ఆ ఆటో ఎక్కాడు. 
 
ఇద్దరూ బద్వేలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పీపీకుంట చెక్ పోస్టు వద్ద దిగి సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లారు. కొంతసేపటికి విఘ్నేష్.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. కొందరు మహిళలు ఆమెను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అమ్మాయిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్క తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది.