శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (22:39 IST)

గూగుల్ నుంచి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

అవును.. గూగుల్ నుంచి గుడ్ న్యూస్.. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ఇది శుభవార్త కానుంది. త్వరలోనే గూగుల్ మెసేజెస్‌ యాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ (ఈటుఈ) ఫీచర్ తీసుకురానున్నట్లు తెలిపింది. ఇటీవలే గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌లో పాత తరం ఎస్సెమ్మెస్‌ స్థానంలో రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ (ఆర్‌సీఎస్‌) పేరుతో ఇన్‌స్టా-ఛాట్‌ను పరిచయం చేసింది. 
 
ఇప్పటి వరకు ఆర్‌సీఎస్‌ సేవలు కొన్ని దేశాలకు పరిమితం కాగా, శుక్రవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినట్లు గూగుల్‌ తెలిపింది. దీని ద్వారా గ్రూప్‌ ఛాట్‌తో పాటు, ఎమోజీలు, ఎక్కువ క్వాలిటీ కలిగిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ తరహాలోనే ఇందులో కూడా ఆన్‌లైన్ స్టేటస్‌, టైపింగ్, రీడ్ ఇండికేటర్స్‌ ఉంటాయి. ప్రస్తుతం పరీక్షలో దశలో ఉన్న ఈ ఫీచర్‌ను 2021 ప్రథమార్ధంలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది.
 
సాధారణ మెసేజింగ్ సేవలు నెమ్మదిగా ఉండటం, ఎన్నో ఏళ్లుగా కొత్త ఫీచర్స్‌ లేకపోవడంతో ఎక్కువ మంది యూజర్స్‌ మెసేజింగ్‌ కోసం వాట్సాప్‌తో పాటు ఇతర యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. వాటికి దీటుగా ఈ ఆర్‌సీఎస్‌ సేవలను గూగుల్ తీసుకొచ్చింది. త్వరలోనే మెసేజెస్‌లో కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ తీసుకొస్తామని గూగుల్ ప్రకటించింది. దాని వల్ల ఇతరులెవరు మెసేజ్‌లను చదవలేరు.