శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (14:57 IST)

కేసీఆర్ డెడ్‌లైన్‌కు భయపడొద్దు... జేజెమ్మ వచ్చినా ఆర్టీసీని క్లోజ్ చేయలేరు

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్‌పై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆర్టీసీ సమ్మెను ఏ ఒక్కరూ క్లోజ్ చేయలేరన్నారు. అందువల్ల ఏ ఒక్క కార్మికుడు భయపడవద్దని తెలిపారు. 
 
కాగా, సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి చేరడానికి మంగళవారం అర్థరాత్రి వరకు తెలంగాణ ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో అఖిలపక్షంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ అయింది. 
 
ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, కార్మికులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. 
 
ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉందని... అందువల్ల ఆర్టీసీని మూసేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవన్నారు. 
 
చర్చలకు పిలవకుండా కార్మికులను భయపెట్టేలా ప్రకటనలు చేస్తున్నారని... ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. భైంసాలో డిపో మేనేజర్ పై జరిగిన దాడికి కార్మికులతో సంబంధం లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.