శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:34 IST)

ఒకే రోజులో 372 లైసెన్సులు సస్పెన్షన్

హెల్మెట్ ధరించకుండా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న  ద్విచక్ర వాహనదారులపై  కేసులు  నమోదు చేయడం  జరిగిందని, కేసులు నమోదు చేయడమే కాకుండా లైసెన్సు సస్పెండ్ చేయడం కూడా జరిగిందని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు.

స్థానిక బందరు రోడ్డులోని డిటిసి కార్యాలయం నుండి శుక్రవారంనాడు ఒక ప్రకటనను విడుదల చేశారు. డిటిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా హెల్మెట్ వినియోగించని ద్విచక్ర వాహనదారులపై చేపట్టిన  ప్రత్యేక తనిఖీలలో గురువారం ఒక్కరోజునే 372 కేసులు నమోదు చెయ్యడం జరిగిందని, అందులోభాగంగా 372 మంది డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన అన్నారు. సెంట్రల్ మోటార్ వాహన చట్టం 138 (F) ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారి డ్రైవింగ్ లైసెన్సులను నెలరోజులపాటు సస్పెండ్ చేయడం కూడా జరిగిందని ఆయన తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్సు రద్దుచేసిన సమయంలో వాహనం నడుపుతూ పట్టుబడితే కేసు రాయడమే కాకుండా వాహనం సీజ్ కూడా చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారే కాకుండా వారివెనక కూర్చొని ప్రయాణించే వారు కూడా హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు.

రహదారి ప్రమాదాలు జరిగిన ప్రతి వందమందిలో  ముప్పైమంది హెల్మెట్ ధరించకపోవడం వలన చనిపోతున్నారని, హెల్మెట్ వినియోగం చట్టరీత్య అవసరమే కాకుండా అది మీకుటుంబం పట్ల నీకున్న బాధ్యతను తెలియజేస్తుందని ఆయన అన్నారు.

త్వరలో రాబోయే నూతన మోటార్ వాహన చట్టంలో హెల్మెట్ ధరించని వారిపై అపరాధ రుసుము వసూలు చేయడమే కాకుండా మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసే విధంగా ఉన్నందున ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు 

సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా లైసెన్సు రద్దు సమయంలో ఉన్నప్పుడు గాని వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఎటువంటి ఇన్సూరెన్సు పరిహారం లభించదని ఆయన తెలిపారు.