1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (12:43 IST)

రూల్ 71 అంటే ఏమిటి? ఆ రూల్‌కు అంత పవరుందా? (video)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇపుడు నిబంధన 71 చర్చనీయాంశంగా మారింది. ఈ నిబంధన గురించి విపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పుణ్యమాని తెలుసుకునే వీలు కలిగింది. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో 150 (స్పీకర్ మినహా) సభ్యుల బలం ఉండటంతో ఏకపక్షంగా ఆమోదించుకుంది. ఆ తర్వాత ఇదే బిల్లును శాసనమండలిలో మంగళవారం ప్రవేశపెట్టింది. ఇక్కడ 34 మంది సభ్యుల మద్దతున్న తెలుగుదేశం పార్టీ బ్రేక్ వేసింది. ఈ బిల్లు అడ్డుకట్టకు రూల్ 71ను ప్రయోగించింది. అంతే.. జగన్ సర్కారు తీవ్ర ఆందోళనకు గురైంది. అసలు ఈ రూల్ 71 అంటే ఏమిటో ఓసారి తెలుసుకుందాం. 
 
ప్రభుత్వ విధానంపై అవిశ్వాసం వ్యక్తం చేసి.. దానిని తిరస్కరించడానికి శాసనమండలికి రూల్‌ 71 అవకాశం కల్పిస్తోంది. అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి తెలుగుదేశం పార్టీ వైకాపా ప్రభుత్వంపై దీన్ని ప్రయోగించింది. ఈ రూల్‌ కింద ఆ పార్టీ తీర్మానం ప్రతిపాదించడంతో అందరి దృష్టినీ ఇది ఆకర్షించింది. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1984లో శాసన మండలిని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత 2007లో మళ్లీ పునరుద్ధరించారు. అప్పటి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ రూల్‌ శాసన మండలి నిబంధనల పుస్తకంలో పొందుపరిచారు. ప్రభుత్వంలోని ఏదైనా శాఖ రూపొందించిన విధానంపై అవిశ్వాసం వ్యక్తం చేసి.. దానిని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రతిపాదించడానికి ఈ రూల్‌ అవకాశం కల్పిస్తోంది. 
 
ఈ నిబంధన కింద పేర్కొన్న నియమాల ప్రకారం ఇటువంటి తీర్మానాన్ని మండలిలోని ఏ సభ్యుడైనా ప్రతిపాదించవచ్చు. సభ ప్రారంభం కావడానికి ముందు మండలి కార్యదర్శికి ఆ సభ్యుడు ఈ తీర్మానాన్ని అందజేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానం సరైన పద్ధతిలో ఉందని మండలి ఛైర్మన్‌ సంతృప్తి చెందితే దానిని చేపట్టడానికి సభ అనుమతి కోరతారు. 
 
సభలో 20 మంది సభ్యులు దానికి మద్దతు పలికితే చర్చ చేపట్టడానికి ఛైర్మన్‌ అనుమతిస్తారు. మంగళవారం మూడు రాజధానుల బిల్లుపై జరిగింది కూడా ఇదే తంతు. దీంతో సర్కారుకు ఏం చేయాలో దిక్కుతోచక.. ఒక సందర్భంగా ఏకంగా శాసనమండలిని రద్దు చేయాలన్న అంశాన్ని కూడా పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి.