1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (12:53 IST)

ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే ... అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని అమ్ముకునే అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సీఎం వైఎస్‌ జగన్ నేతృత్వంలో జరిగింది. పలు కీల‌క అంశాల‌పై నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాల పథకాల అమ‌లు, జగనన్న విద్యాకానుక, నాడు - నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించారు.
 
ఈ నెల 10న అమలు చేయనున్న వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకంపై కూడా చర్చించారు. పులిచింతల ప్రాజెక్ట్‌ గేటు విరిగిన అంశంపై కేబినెట్‌లో చర్చించారు. 20 నిముషాల పాటు స్టాప్ లాక్ గేటు, హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
 
* ప్రాథమిక దశలోనే మెరుగైన విద్య అందించేలా చర్యలు
* 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలల్లో మెరుగైన వసతులు
* ప్రతి తరగతిలో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా ఉంటుంది
* నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి
* శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ PP1 పేరుతో అంగన్వాడీ స్కూళ్లలో విద్య నేర్పాలి
* ఫౌండేషన్ స్కూల్స్‌లో PP1, PP2, 1, 2 తరగతులకు పాఠాలు
* హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం
 
* 2020-21 సంవత్సరానికి  నేతన్న నేస్తం పథకం అమలుచేయాలని నిర్ణయం
* ఈ నెల 24న 10 వేల నుండి 20 వేల డిపాజిట్‌ ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు
* అభ్యంతరంలేని 300 చదరపు గజాల వరకు రేగ్యులరైజేషన్ చేయాలని నిర్ణయం
* అక్టోబర్ 15, 2019 నాటికి ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారికి ఇది వర్తింపు
* అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని అమ్ముకునే అవకాశాన్ని.. 20 ఏళ్ల నుండి 10 ఏళ్లకు తగ్గిస్తూ కాబినెట్‌లో నిర్ణయం