1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (07:51 IST)

నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు... ఉదయం 11 గంటలకు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదలకానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి, రెండో సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేస్తామని ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది. 
 
కాగా, ఏపీలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. ఒకేషనల్, రెగ్యులర్ కలిపి మొదటి సంవత్సరంలో 5,17,617 మంది విద్యార్థులు హాజరుకాగా, ద్వితీయ సంవత్సరంలో 5,35,056 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లో చూడొచ్చని ఇంటర్మీడియట్ విద్యామండలి తెలిపింది. 
 
జనసేనకు మద్దతు.. ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తా : నటుడు నవదీప్ 
 
తాను జనసేనకు మద్దతు తెలుపుతున్నానని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తానని టాలీవుడ్ నటుడు నవదీవ్ అన్నారు. రానున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా, జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ జాబితాలో తన అన్న, జేఎస్పీ నేత నాగబాబు, భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ మాస్టర్ జానీ, సినిమా హీరో సాగర్, నటుడు పృథ్విరాజ్, జబర్దస్త్ కమెడియన్లు హైపర్ ఆది, గెటప్ శ్రీనులు ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని మరో నటుడు నవదీప్ తెలిపారు. 
 
కాగా, ఆయన పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానాన్ని సందర్శించుకున్నారు. తాను నటించిన "లవ్ మౌళి" సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ ఆలయంలో నవదీప్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. పవన్‍‌కు తన మద్దతు ఉంటుందన్నారు. ఇకపోతే తన కొత్త చిత్రం "లవ్ మౌళి" సరికొత్త కాన్సెప్టుతో వస్తుందని తెలిపారు. ఓ భిన్నమైన ప్రేమకథతో వస్తున్న ఈ మూవీలో నవదీప్ సరసన గిద్వానీ, భావనలు హీరోయిన్లుగా నటించారు.