మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (10:54 IST)

పంచాయతీ పోరు నిర్వహించి తీరుతాం : తొలి దశకు నోటిపికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ముందుకే వెళ్తున్నామని.. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించడం కమిషన్ విధిగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
 
రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా.. అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ మానసపుత్రికే ఎన్నికల సంఘం అని చెప్పారు.
 
అందుకే తాము ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించి ముందుకు వెళ్తున్నామ‌న్నారు. అయితే, కొంద‌రు ప్ర‌భుత్వ‌ అధికారులు ఎన్నిక‌ల ప్ర‌క్రియను స‌మ‌ర్థంగా కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంపై సుప్రీంకోర్టు ఏ నిర్ణ‌యం తీసుకున్నా త‌ప్ప‌కుండా పాటిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.
 
ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఏపీ ప్ర‌భుత్వం నుంచి మిశ్ర‌మ అనుభ‌వాలు ఉన్నాయ‌న్నారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో స‌మావేశంలో పాల్గొనాల‌ని సీఎస్‌, పంచాయ‌తీ రాజ్ ముఖ్య కార్య‌ద‌ర్శి హాజ‌రు కావాల‌ని కోరామ‌ని తెలిపారు. అయితే, వారు అందుకు హాజ‌రు కాలేద‌ని తెలిపారు. స‌రైన స‌మ‌యంలో స‌రైన రీతిలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఏదేమైనా స‌రైన స‌మ‌యానికి ఎన్నిక‌లు జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు.
 
ఏక‌గ్రీవ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తామ‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ తెలిపారు. ఐజీ స్థాయి అధికారితో ఏక‌గ్రీవాల‌పై దృష్టి పెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ విధులు, నిధులు, అధికారాలు వంటి అంశాలన్నీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ వ‌ల్లే సాధ్య‌మ‌వుతాయ‌ని ఆయ‌న చెప్పారు.
 
స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో గ‌వ‌ర్న‌ర్ నుంచి త‌మ‌కు పూర్తి మ‌ద్ద‌తు వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ తెలిపారు. ప్ర‌భుత్వ ఉదాసీన‌త విష‌యాన్ని తాను గ‌వ‌ర్నర్ దృష్టికి తీసుకెళ్లాన‌ని తెలిపారు.‌ ఎన్నిక‌ల వ‌ల్ల స్థానిక నాయ‌క‌త్వం బ‌ల‌ప‌డుతుంద‌ని ఆయన చెప్పారు.
 
 
ఏపీ పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్
 
ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 27 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు
ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన
ఈ నెల 29 నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఈ నెల 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఈ నెల 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు