శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కొమిరేపల్లికి ఏమైంది.. వణకిస్తున్న అంతుచిక్కని వ్యాధి

వెస్ట్ గోదావరి జిల్లా కొమిరేపల్లిలో ఓ అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి దెబ్బకు స్థానికులు భయంతో వణికిపోతున్నారు. పైగా, ఈ వ్యాధి అంతకంతకూ విస్తరిస్తోంది. దీంతో ఈ వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 
 
జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లిలో శుక్రవారం 25 మంది, భీమడోలులో ఇద్దరు, ఏలూరులో ఇద్దరు చొప్పున వింతవ్యాధితో ఆసుపత్రిలో చేరారు. ఇక, ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య భీమడోలులో 36కు పెరిగింది. 
 
అయితే, కొమిరేపల్లిలో గురువారం నమోదైంది ఒక్క కేసే. కానీ శుక్రవారానికి బాధితుల సంఖ్య ఒక్కసారిగా 25కు పెరిగింది. వీరిలో పురుషులు 16 మంది, మహిళలు 9 మంది ఉన్నారు. 21 మంది వ్యాధి నుంచి కోలుకోగా, నలుగురు ఇంకా చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
 
మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని, ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గీతా ప్రసాదిని, మంత్రి ఆళ్ల నాని తదితరులు కొమిరేపల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 
 
గ్రామంలో రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఏలూరులో తగ్గిందనుకున్న వ్యాధి మళ్లీ వెలుగు చూడడం కలవరపెడుతోంది. నిన్న ఓ బాలిక, మరో వృద్ధుడు ఇవే లక్షణాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.