శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 22 జనవరి 2021 (21:52 IST)

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల వివాదం: టీకా వేసిన 60 రోజుల తర్వాత ఎన్నికలకు సిద్ధం - రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో పోలీసులు, రెవెన్యూ సహా పోలింగ్ సిబ్బందికి మొదటి దశలో టీకా వేసిన 60 రోజుల తర్వాత పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు.

 
ఈ లేఖను పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వేవేది, కమిషనర్ గిరిజా శంకర్ తీసుకెళ్ళి ఎస్ఈసీకి అందించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ తేల్చి చెప్చేశారు. పోలింగ్‌, వ్యాక్సినేషన్‌ రెండూ ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. పోలింగ్‌, వ్యాక్సినేషన్‌ రెండూ ఒకేసారి జరగాలంటే వ్యాక్సినేషన్ వాయిదా వేయాల్సి వస్తుందన్నారు.

 
అదే సమయంలో ఎస్‌ఈసీ తన నిర్ణయంపై పునఃపరిశీలించాలని సీఎస్ విన్నవించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన కోరారు. అంతేకాకుండా గత ఏడాది స్థానిక ఎన్నికల సందర్భంగా కొందరు అధికారులు నిబంధనలు ఉల్లంఘించారంటూ వారిని విధుల నుంచి తొలగించాలని ఎస్‌ఈసీ రాసిన లేఖకి అనుగుణంగా చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు.

 
కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, విపత్తు వేళ విధులు సమర్థవంతంగా నిర్వహించిన వారిని తొలగించడం సాధ్యం కాదన్నారు. ఎస్‌ఈసీ, ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పిందని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు. కరోనా మొదటి డోస్‌ తీసుకున్న వారికి రెండోడోస్‌ ఇచ్చిన నాలుగు వారాలకు ఇమ్యూనిటీ వస్తుందని గుర్తు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను మనస్ఫూర్తిగా పాటించేందుకు ఎస్‌ఈసీ, ప్రభుత్వం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు.

 
తాజా లేఖలో ఎస్‌ఈసీకి చెప్పిన విషయాలన్నీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలో ఉన్నాయని తెలిపారు. ‌సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగాలని ఎస్‌ఈసీని కోరారు. తీర్పు వచ్చే వరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. దాంతో ఈ పరిణామాలు రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేదని సీఎస్ స్పష్టం చేయగా, ఎన్నికల నోటిఫికేషన్‌కి సర్వత్రా సిద్ధం చేసి, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నిన్నటి నుంచే అమలులో ఉందని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిబంధనావళి జారీ చేశారు.

 
సుప్రీంకోర్టులో సోమవారం విచారణ..
మరోవైపు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటీషన్ లిస్ట్ అయ్యింది. సోమవారం విచారణకు రాబోతోంది. సోమవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ ఈ కేసుని విచారించబోతోంది. ఏపీలో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా పంచాయితీ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఏపీ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పుని నిలిపివేయాలని కోరుతోంది.

 
ఉదయం నుంచి ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్ల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేరకు సహకారం అందుతుందనే విషయంలో స్పష్టత కనిపించడం లేదు. శనివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా, ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే చర్చ సాగుతోంది.

 
ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి జనవరి 9న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. అందులో భాగంగా 4 విడతల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమయ్యారు. అయితే దానిని ఏపీ ప్రభుత్వం కోర్టులో సవాల్ చేయడంతో ఏపీ హైకోర్టు ఎస్ఈసీ నోటిఫికేషన్ కొట్టేసింది. ఆ తర్వాత ఎస్ఈసీ దానిని ద్విసభ్య బెంచ్‌కి రిట్ ఫిటీషన్ దాఖలు చేసింది. ఎస్ఈసీ వాదనను అంగీకరిస్తూ వాక్సినేషన్ ప్రక్రియతో పాటుగా ఎన్నికల నిర్వహణ కూడా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏపీ గవర్నర్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం పంచాయితీరాజ్ అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 10 గంటలకు సీఎంవోలో సమావేశం పేరుతో అధికారులు హాజరు కాలేకపోతున్నట్టు సమాచారం అందించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3గం.ల ప్రాంతంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ మరోసారి గైర్హాజరు కావడంతో ఎస్ఈసీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

 
పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌‌కి మొమో జారీ చేశారు. సమావేశాన్ని సాయంత్రం 5గంటల ప్రాంతంలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సాయంత్రం 6గంటల వరకూ సమావేశం జరగలేదు. అదే సమయంలో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్‌తో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదితో పాటుగా కమిషనర్ గిరిజా శంకర్ సమావేశమయ్యారు. ఎస్ఈసీ సమావేశానికి సంబంధించి వారి మధ్య చర్చ జరిగినట్టు ప్రచారం సాగుతోంది. తొలుత ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత సీఎస్‌తో సమావేశం కావడంతో ఎస్ఈసీతో భేటీ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం కొనసాగుతోంది.

 
మరోవైపు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో పాటుగా ఏపీ డీజీపీకి ఎస్‍ఈసీ లేఖ రాశారు. గత మార్చిలో తీసుకున్న చర్యకు అనుగుణంగా తొమ్మిది మంది అధికారులను ఎన్నికల విధులకు దూరం పెట్టాలని ఎస్ఈసీ కోరింది. వారిలో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లతో పాటుగా తిరుపతి అర్బన్ ఎస్పీ కూడా ఉన్నారు. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలతో పాటుగా మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు.

 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. హోం మంత్రి సుచరిత, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల వంటి కీలక నేతలు పాల్గొన్నారు. దాంతో ఇటు ప్రభుత్వం, ఇటు ఎస్ఈసీ మధ్య వివాదంగా మారిన వ్యవహారం ఆసక్తిగా కనిపిస్తోంది.

 
అంతకుముందు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ సక్రమంగా లేదంటూ సుప్రీంకోర్ట్ విచారణకు తిరస్కరించింది. వాటిని సరిదిద్ది మళ్లీ పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. దాంతో సోమవారం వరకూ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో ఈ పరిణామాలన్నీ పెద్ద చర్చకు ఆస్కారమిస్తున్నాయి.