బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 జులై 2019 (15:08 IST)

గ్రామ వలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు... 30 నిమిషాలు ముందుగా హాజరుకావాలి...

ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకే చేర్చేందుకు వీలుగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గ్రామ వలంటీర్లను గౌరవ వేతనంతో నియమించనున్నారు. ఇందులోభాగంగా, గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వారికి గురువారం నుంచి  ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఒక్కో గ్రామంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఒకే రోజున ఇంటర్వ్యూలు పూర్తి చేయనున్నారు. 
 
ఈ ఇంటర్వ్యూలు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కలిసి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఏదైనా మండలంలో 700కుపైగా దరఖాస్తులు వస్తే అక్కడ అదనంగా ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఇప్పటికే సూచించారు. 
 
తొలిరోజు ఒక్కో మండలంలో ఇంటర్వ్యూ బోర్డు 30 మందికి, రెండో రోజు నుంచి రోజూ 60 మందికి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యనే ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు. మహిళా అభ్యర్థులు, దివ్యాంగులను మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30 గంటల మధ్య ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు ఫొటో ఐడీ, జెరాక్స్‌ కాఫీలు, సంబంధిత పత్రాలతో ఇంటర్వ్యూకు 30 నిమిషాల ముందుగా హాజరు కావాల్సి ఉంటుందని మండల స్థాయి అధికారులకు కమిషనర్‌ గిరిజాశంకర్‌ వివరించారు.
 
గ్రామ వలంటీర్ల ఎంపికలో భాగంగా 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారిని ఎంపిక చేస్తారు. రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ పోస్టులుగా వర్గీకరిస్తారు. ఒక గ్రామంలో దరఖాస్తు చేసుకున్న వలంటీర్లందరికీ ఒకే రోజు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూల్లో ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, జనరల్‌ అవేర్‌నెస్‌, యాటిట్యూడ్‌, సామాజిక బాధ్యత, సాంఘిక సమస్యలపై అవగాహన, స్థానిక సమస్యలపై అవగాహన, నాయకత్వ లక్షణాలు వంటి వాటిని పరిశీలిస్తారు.