మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఏపీ ఎండీసీ కార్యాలయం సీజన్... ఎండీపై వేటు : ఏపీ సర్కారు వేటు

apmdc
విజయవాడ తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఏపీ ఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆ తర్వాత రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్, ఎండీసీ ఎండీగా కొత్తగా యువరాజ్‌ను నియమించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గనుల శాఖపై వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. 
 
రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా జోడు పదవులు నిర్వహిస్తున్న వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రే ప్రభుత్వం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. అలా ఆయన బదిలీ అయిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు.
 
అర్థరాత్రి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గనులశాఖ కార్యాలయం, తాడిగడప సమీపంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాలను ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుని సీజ్ చేసింది. కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు సోదాలు చేసి పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
 
కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్క‌లు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీసు మూసేఉంటుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
 
కాగా, గనుల శాఖ ఆధ్వర్యంలో ఇష్టానుసారంగా బీచ్ శాండ్, బెరైటీస్, ఇసుక, బొగ్గు, ఇతర ఖనిజాల వేలం, టెండర్లు, అమ్మకాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. తద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ ముఖ్యులకు వెంకటరెడ్డి భారీ లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.
 
మరోవైపు గనుల శాఖ డెరెక్టర్‌గా, ఎండీసీ ఎండీగా యువరాజ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఐసీ భవనంలోని తన కార్యాలయంలో గనుల శాఖ అధికారుల సమక్షంలో ఆయన చార్జ్ తీసుకున్నారు. అనంతరం గనుల శాఖ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులు, కీలక అంశాలపై రెండు గంటలపాటు సమీక్ష చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.