1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (19:03 IST)

ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్.. ఆరో తేదీ అర్థరాత్రి నుంచి బస్సు సేవలు బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ సాధన సమితికి సంఘీభావం తెలిపుతూ ఈ నెల ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా సంపూర్ణ మద్దతును ఐక్య వేదిక నేతలు ప్రకటించారు. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మెమోరాండం సమర్పించారు. ఇందులో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న 45 సమస్యలను కూడా పొందుపరిచారు. 
 
తమ సమస్యలు సత్వరమే పరిష్కారించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ఎండీకి తేల్చి చెప్పారు. ఆరో తేదీలోపు తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఏడో తేదీ నుంచి అంటే ఆరో తేదీ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.