Attack on Chilkur Priest: తెలంగాణ సర్కారు వారిని కఠినంగా శిక్షించాలి.. పవన్ కల్యాణ్ (video)
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సి.ఎస్. రంగరాజన్పై జరిగిన దాడిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రంగరాజన్పై ఒక బృందం దాడి చేసినట్లు తెలిసి తీవ్ర బాధ కలిగిందని, ఈ దాడి దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడి అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
రంగరాజన్ దశాబ్దాలుగా ధర్మాన్ని కాపాడటానికి, ఆలయ సంప్రదాయాలను కాపాడటానికి, వాటి పవిత్రతను కాపాడటానికి అంకితభావంతో ఉన్నారు. తమను తాము 'రామ రాజ్య' సభ్యులుగా చెప్పుకునే ఒక బృందం అతనిపై దాడి చేసింది. పోలీసులు దీని వెనుక ఉన్న కారణాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించాలి" అని పవన్ కళ్యాణ్ అన్నారు.
కాగా.. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సీఎస్ రంగరాజన్పై రామరాజ్యం అనే సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో హిందూధర్మంపై జరిగే దాడులను ఖండిస్తుంటారు. అయితే.. శుక్రవారం వీర రాఘవరెడ్డి 20 మంది రామరాజ్యం సభ్యులతో కలిసి చిలుకూరుకు వచ్చారు. చిలుకూరు ఆలయాన్ని నాకు అప్పగించాలని రంగరాజన్ను బెదిరించారు. లేనిపక్షంలో అంతుచూస్తానంటూ హెచ్చరించారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో అతనిపై దాడి చేశారు.
ఈ దారుణంపై రంగరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించింది. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించింది.