కిరణ్ రాయల్ కేసులో ట్విస్ట్... మహిళను అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు.. ఎలా? (Video)
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మి వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతి ప్రెస్క్లబ్లో విలేఖరుల సమావేశాన్ని ముగించుకుని వస్తున్న ఆమెను రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ మోసం కేసులో లక్ష్మిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమెును ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆర్థిక లావాదేవీలు, ఇతర వివాదాల నేపథ్యంలో కిరణ్ రాయల్పై లక్ష్మి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని కిరణ్ రాయల్ను జనసేన పార్టీ ఆదేశించింది. పైగా కిరణ్ రాయల్ అంశం ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ మహిళతో పాటు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేశాడు.
ఇంతలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ రాయల్పై ఆమె మరికొన్ని ఆరోపణలు చేశారు. ఆయన మాయమాటలకు తాను మోసపోయానని చెప్పారు. తన పిల్లల భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నట్టు వెల్లడించారు. కిరణఅ రాయల్ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. తనకు ఏ పార్టీ నుంచి మద్దతు లేదని, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని లక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఇంతలోనే ఆమెను ఆన్లైన్ మోసం కేసులో జైపూర్ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.