శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 జులై 2021 (08:25 IST)

పాపం బుగ్గన! ఢిల్లీలో పడిగాపులు పడుతున్న ఆర్థిక మంత్రి!

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఢిల్లీలో రెండు రోజులుగా పడిగాపులు పడుతున్నారు.  అప్పుల మీద అప్పులు చేస్తూ పోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీకి బుగ్గన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

అలాగే.. ఇటీవలే కేంద్ర మంత్రి హోదా పొందిన పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డిని కలవడంతోపాటు, ఈ నెల తొలివారంలో జరిపిన ఢిల్లీ పర్యటనలోనే కేంద్ర న్యాయ, పర్యాటక, ఉక్కుశాఖల మంత్రులను కలియాలని బుగ్గన ప్రయత్నించారు.

అప్పట్లో వారు అందుబాటులో లేరు. ఇంతలో జరిగిన మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆ మూడు శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు.  మంత్రి బుగ్గన నెలలో కనీసం రెండు,మూడు పర్యాయాలు ఢిల్లీకి రావడం గత రెండేళ్లుగా పరిపాటిగా మారింది. గతంలో ఆయన పర్యటన వివరాలు మీడియాకు తెలిసేవి.

గత రెండు, మూడు నెలల నుంచి మాత్రం గోప్యత పాటిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్న నేపథ్యంలో అప్పుల కోసం ఆర్థిక మంత్రి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నట్లు మరోపక్క ప్రచారం జరుగుతుంది. దీంతో ‘చక్కర్ల మంత్రి’ అంటూ తెరవెనుక సరదాగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కూడా.

రాష్ట్రం నుంచి అధికారిక పర్యటనలకు వచ్చినప్పుడు మంత్రులు ఏపీభవన్‌లో బస చేయడం సంప్రదాయం. దీనికి భిన్నంగా ఆయన, ఆయన వెంట ఢిల్లీకి వచ్చే ఉన్నతాధికారులు లక్షలాది రూపాయలు ఖర్చుచేసి స్టార్‌ హోటళ్లలో దిగుతున్నారు.