బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (22:19 IST)

పియూష్ గోయల్ తో బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ

జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ ఎఫ్ ఎస్ ఏ) 2013 ద్వారా రాష్ట్రానికి రావలసిన రేషన్ వాటా పై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పియూష్ గోయల్ తో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చర్చించారు. 

ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలోని రైల్వే భవన్ లో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ ఎస్ రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావ్నా సక్సేనా పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ పేదరికం ఆధారంగా చేసిన ఎన్ ఎఫ్ ఎస్ ఏ చట్టం 2013, అమలు అయిన తరువాత దాని ద్వారా  రాష్ట్రానికి రావలసిన రేషన్ వాటా చాలా తక్కువ పరిమాణంలో వస్తోందన్నారు. 

ఎన్ ఎఫ్ ఎస్ ఏ  చట్టం ప్రకారం రేషన్ వాటా గ్రామీణ ప్రాంతాలకు 75%, పట్టణ ప్రాంతాలకు 50% రావాలి, అయితే 60% మరియు 40% మాత్రమే వస్తున్న పరిస్థితి ఉందని వివరించారు.   పేదలకు రేషన్ ను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది కాబట్టి ఆ భారాన్ని భరించాల్సివస్తోందని పేర్కొన్నారు.   

దీని వల్ల రాష్ట్ర ఖజానా పై అధిక భారం పడుతోందన్నారు.  ఈ విషయం పై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందన్నారు. నేడు ఈ విషయం కేంద్ర మంత్రికి వివరించగా ఆయన పరిశీలనకు ఆదేశించారని తెలిపారు. రబీ వడ్ల సేకరణ, గరీబ్ కళ్యాణ్ యోజన లకు  సంబంధించిన బకాయిలు రాష్ట్రానికి చెల్లించవల్సిందిగా మంత్రి ఆదేశించారన్నారు. 

ఉదయం నీతీ ఆయోగ్  సీ ఈ వో అమితభ్ కాంత్, వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ లను   కలిసి పోలవరం,  నీటి పారుదల ప్రాజెక్ట్ లు,  పేదల ఇళ్ల నిర్మాణం మరియు వారి కాలనీలకు మౌలిక సదుపాయాల కల్పన కై కేంద్ర ఆర్థిక సహాయాన్ని కోరడం జరిగిందన్నారు.