1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (22:00 IST)

డివైన్ బాలాజీ దర్శన్ ప్యాకేజీ.. రూ.990 చెల్లిస్తే చాలు.. ఒక్క రోజే శ్రీవారి దర్శనం

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గింది. కరోనా భయంతో ఎక్కడికీ వెళ్లలేకపోయారు ప్రజలు. తీర్థయాత్రలు, టూర్లు అన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి తగ్గడంతో మళ్లీ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారా.. అయితే టీటీడీ సూపర్ ఆఫర్ ఇచ్చింది.  
 
ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ 'డివైన్ బాలాజీ దర్శన్' ప్యాకేజీని తిరిగి ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ధర రూ.990 మాత్రమే. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు తిరుమలలో శ్రీవారిని ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా దర్శించుకోవచ్చు. అంటే ప్యాకేజీలోనే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కలిపి ఉంటుంది.
 
తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగానే ఐఆర్‌సీటీసీ 'డివైన్ బాలాజీ దర్శన్' ప్యాకేజీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు తిరుపతికి చేరుకున్న తర్వాత ఈ ప్యాకేజీ మొదలవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న భక్తులను ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమలకు తీసుకెళ్తారు. 
 
ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట లోపే దర్శనం పూర్తవుతుంది. ఆ తర్వాత తిరుమలలోనే భోజనం చేయాలి. భక్తులు సొంత ఖర్చులతోనే భోజనం చేయాల్సి ఉంటుంది.
 
తిరుమలలో దర్శనం పూర్తైన తర్వాత తిరుచానూర్ బయల్దేరాలి. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తైన తర్వాత భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. దీంతో ఈ టూర్ ముగుస్తుంది. ఒకవేళ తిరుమలలో శ్రీవారి దర్శనం ఆలస్యం అయితే తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే అవకాశం ఉండదు.
 
తిరుమలలో ఒకరోజులోనే దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమల వెళ్లేందుకు వాహన సదుపాయం, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ మాత్రమే కవర్ అవుతాయి. భోజనం, వసతి, ఇతర సదుపాయాలేవీ ఇందులో కవర్ కావు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.