శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (20:22 IST)

రైలు ప్రయాణం చేస్తే ఒక్క రోజులోనే శ్రీవారి దర్శనం ఎలా? (video)

దూర ప్రాంతాలకు చెందిన శ్రీవారి భక్తులకు ఓ శుభవార్త. ఇకపై శ్రీవారి దర్శనం కోసం రైలులో తిరుపతికి చేరుకుంటే ఒక్క రోజులోనే దర్శనం భాగ్యం లభించనుంది. ఈ విషయాన్ని రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలని భావించే భక్తులు, రైల్లో తిరుపతికి చేరుకుంటే, ఒక్క రోజులోనే స్వామివారి దర్శనంతో పాటు, తిరుచానూరు అమ్మవారి దర్శనాన్ని కూడా కల్పించేలా రూ.990 ధరలో టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. 
 
అయితే, ఉదయం 8లోగా తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న భక్తులకు మాత్రమే ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ఇందులో భాగంగా ఏసీ వాహనంలో తిరుమలకు తీసుకుని వెళ్లి, ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనం కూడా ఇది మధ్యాహ్నం ఒంటిగంటలోపు పూర్తవుతుంది. 
 
కానీ, కొండపై భక్తుల రద్దీని బట్టి ఈ సమయం మారవచ్చు. ఆపై సొంత ఖర్చుతో భోజనం అనంతరం యాత్రికులకు తిరుచానూరు తీసుకుని వెళ్లి అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి, తిరిగి రైల్వే స్టేషన్‌కు చేరుస్తారు. ఇది ఒక రోజు ప్యాకేజీ అని, వసతి సౌకర్యాలు ఉండవని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.