శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:59 IST)

కరోనా విజృంభణ: ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి ఇవాళ్టి నుంచి ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుందని తెలిపింది. అనుమతులు లేకుండా బయటకు వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాజా ప్రకటనలో తెలిపింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 3548 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేసుల్లో ఆరు శాతం పెరుగుదల కనిపించింది. సోమవారం ఒక్క రోజే 15 మంది చనిపోయారు.

కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కట్టడి చర్యలకు కేజ్రీవాల్ సర్కార్ దిగింది. రాష్ట్రంలో ప్రస్తుతానికి లాక్ డౌన్ విధించేది లేదని, అయితే రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.