శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:32 IST)

గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు..ఎందుకు?

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదుచేశారు.

ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేయడమే దీనికి ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. తమ విచక్షణాధికారాలతో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

ఫోన్‌లో జిల్లా కలెక్టర్‌ స్పందించకపోవడంతో నేరుగా వినతిప్రతం ఇచ్చేందుకు సైకిల్‌పై బయలుదేరితే భీమవరం వద్ద నిమ్మలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారని పేర్కొన్నారు.

అదే రోజు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి, కలెక్టర్‌ నిర్వహించిన సమావేశంలో 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారని, స్వయంగా మంత్రులే లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే వారిపై ఎటువంటి చర్యలూ లేవని అన్నారు. ప్రొటోకాల్‌ నిబంధనలకూ తూట్లు పొడిచారని తెలిపారు. 
 
కేంద్ర హోం సెక్రటరీ, తమిళనాడు సిఎంకు లేఖలు 
తమిళనాడులోని చెన్న్తె, ఇ-రోడ్‌, తిరుపూరు జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో ఆంధ్రాకు చెందిన రూ.2 వేల మంది కార్మికులు లాక్‌డౌన్‌తో ఇరుక్కుపోయారని, వారందరికీ భోజనం, వసతి, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ కేంద్ర హోం సెక్రటరీ అజరుకుమార్‌ భల్లా, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి చంద్రబాబు వేర్వేరుగా లేఖలు రాశారు.

కాగా కరోనా కట్టడికి చేస్తున్న కృషిలో అందరమూ భాగస్వామ్యులవుదామని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్యులకు, ఆరోగ్య రంగ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.