శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (11:29 IST)

గుంటూరు జిల్లాలో 31 వరకు శాశ్వత వ్యాక్సిన్ కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో రద్దీని నియంత్రించేందుకు ఈ నెల 10వ తేదీ నుంచి 31వ  వరకు 77 ప్రదేశాల్లో శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఆయా కేంద్రాల్లో ఈ నెల 31 వరకు ఎవ్వరికీ మొదటి డోస్‌ వేయొద్దని కలెక్టర్‌ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రెండో డోసు వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తారు. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, సచివాలయాల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వైరస్‌ వ్యాప్తి ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని విశాలమైన ప్రాంగణాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌ రెండు కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. 
 
ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌లు ఎలాగైతే ఏర్పాటు చేస్తారో అదే రీతిన వీటిని పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్‌లో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 77 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. కాగా, హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి ఎర్ర రంగు, 60 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులకు పచ్చ రంగు, 45 ఏళ్ల వయస్సు దాటిన వారికి బులుగు రంగు టోకెన్లు జారీ చేస్తారు. 
 
ఎవరైతే రెండో డోస్‌ కోసం 6, ఎనిమిది వారాలు దాటిన వారు ఉంటారో వాళ్లకి టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లకు సంబంధించి రిజిష్టర్‌ నిర్వహించాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రజలు, వృద్ధులకు ఒక రోజు ముందు మాత్రమే టోకెన్లను వలంటీర్ల ద్వారా జారీ చేస్తారు. 
 
ఫ్రంట్‌ లైన్‌, హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కి మాత్రం సంబంధిత శాఖల అధిపతుల ద్వారా పంపిణీ చేస్తారు. టోకెన్లు దుర్వినియోగం చేస్తే సంబంధిత వీఆర్‌వో, పంచాయతీ సెక్రెటరి, వార్డు సెక్రెటరిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అన్ని చోట్ల బ్యారికేడింగ్‌ చేస్తారు. ప్రతీ కేంద్రం వద్ద ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఒక మహిళా రక్షణ కార్యదర్శి ఉంటారు.