ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (15:57 IST)

అమరావతిని శ్మశానం-ఎడారి అంటుంటే బాధేస్తోంది: చంద్రబాబు

రాజధానిని శ్మశానం, ఎడారి అంటే చాలా బాధేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ  29 గ్రామాల రైతులు, మహిళల దీక్షలు 50వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రాయపూడిలో ఏర్పాటు చేసిన  దీక్షాశిబిరాన్ని చంద్రబాబు సందర్శించారు. మహిళలు, రైతులకు సంఘీభావం తెలిపారు.
 
అమరావతికి వరదలు వస్తాయని, రాజధాని మునిగిపోతుందంటూ పదేపదే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలను విమర్శించారు. 23 ఏప్రిల్‌ 2015న కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీ రాజధాని అమరావతి అని.. ఈ విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు అన్నారు.

చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు.
 
‘‘అన్ని రాష్ట్రాలకంటే ఏపీ మిన్నగా ఉండాలని పని చేశా. అప్పట్లో హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించక పోయి ఉంటే.. ఆ నగరం అంత అభివృద్ధి చెందేదా? అన్ని కంపెనీలు అక్కడికి వచ్చేవా? అదే తరహాలో అమరావతిని కూడా నిర్మించాలనుకున్నాను. కానీ, అధికార మార్పిడి జరిగింది.

వైకాపా ప్రభుత్వం వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన సంస్థలన్నీ తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది’’ అని చంద్రబాబు అన్నారు. రైతుల పోరాటం తప్పనిసరిగా విజయం  సాధిస్తుందని ఆకాంక్షించారు. ప్రాచీన నగరానికి అమరావతి చిహ్నమని చంద్రబాబు తెలిపారు.