శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (19:34 IST)

వెంకయ్యకు జగన్ క్షమాపణ చెప్పాలి: కన్నా డిమాండ్

వెంకయ్య కు జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...

"రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి గురించి సీఎం చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో వెంకయ్యనాయుడు పాత్ర ఎనలేనిది. మాతృభాషలో బోధన ఉండాలని మాత్రమే ఉపరాష్ట్రపతి సూచించారు. కానీ వెంకయ్యనాయుడుని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా మాట్లాడటం సరికాదు. 
 
గతంలో తెదేపా హయాంలో ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు సమయంలో జగన్ తీవ్రంగా విమర్శించారు. అప్పుడు ఇంగ్లీషు మీడియం వద్దని.. ఇపుడు ఎలా ప్రవేశపెడతారు? నిర్బంధంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎన్నో ఏళ్లు పోరాడి తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కించుకున్నాం.

తన తండ్రి వైయస్ హయాంలోనే ప్రాచీన హోదా వచ్చిన విషయం జగన్ గుర్తించుకోవాలి. మేం ఏ భాషకు వ్యతిరేకం కాదు. మాతృభాషలో భోదన కూడా ఉండాలనేది మా డిమాండ్. తెలుగు మీడియం కొనసాగిస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టండి. వెంకయ్యనాయుడు చేసిన సూచన పాటిస్తే సరే లేకపోతే లేదు. ఉపరాష్ట్రపతిపై  చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. 
 
రాష్ట్రంలో ఇంకా ఇసుక కొరత తీరలేదు. మద్యం పాలసీ వెంటనే అమలు చేసిన వాళ్లు ఇసుకను ఎందుకు ఆపి వేశారు? దీని వెనుక ముఖ్యమంత్రి రహస్య ఎజెండా ఏమిటో బయటపెట్టాలి. ఇసుక కొరత తీరకుండానే ఇపుడు సిమెంటు ధరలు పెంచారు. ఇది కూడా ప్రజలపై అదనంగా భారం మోపడమే అవుతుంది. 
 
బిజెపి ప్రజలపక్షాన ఒంటరిగానే ఉద్యమాలు చేస్తుంది. గృహ నిర్మాణ రంగానికి కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిరుత్సాహపర్చటం సరికాదు" అని హితవు పలికారు.

విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్సులు అడపా శివనాగేంద్రరావు,తాళ్ల వెంకటేష్ యాదవ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండవరపు జగన్,పాలిశెట్టి రఘు,రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.