శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (12:55 IST)

జగన్ రాజీనామా చేయాలి: బీజేపీ డిమాండ్

ఏడాది పాలనలో పూర్తి గా విఫలమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్షిన్నారాయణ డిమాండ్ చేశారు.

అప్రజాస్వామ్యం, అవినీతి, అనుభవరాహిత్యం, కక్ష సాధింపులు, అసమర్థత, అప్పులే ప్రాధాన్యంగా జగన్‌ ఏడాది పాలన సాగిందని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చలేని అసమర్థత కనబడుతోందని ధ్వజమెత్తారు. జగన్‌ మూడు రాజధానుల చుట్టూ రాజకీయం చేస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు. 
 
ఆయన మీడియాతో మాట్లాడుతూ... "రాష్ట్ర విభజన తరువాత టిడిపి, వైసిపి రెండు ప్రాంతీయ పార్టీలు మధ్య పోటీ జరిగింది. అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు తన అనుభవంతో ఎలా దోచుకోవాలి? కేంద్రం నుంచి తెచ్చి ఎలా పక్కదారి పట్టించాలి అనే ఆలోచన చేశారు.
 
2014-19 వరకు కేంద్రం నిధులను సొంత పధకాలుగా ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు చేసిన తప్పులను చూపుతూ.. నాకు అవకాశం ఇవ్వాలని జగన్ ప్రజలను కోరాడు. 2019లో ప్రజలు నమ్మి జగన్ కు అవకాశం ఇస్తే... ఆయన విశ్వరూపం చూపిస్తున్నారు. జగన్ మాటలు వింటుంటే... ప్రజలు తమను తామే మోసం చేసుకునే విధంగా ఉన్నాయి.

అనుభవ రాహిత్యం, అసమర్ధత, అవినీతి, అవగాహన లేకపోవడం, ఆత్రం, పోలీసు రాజ్యం, రివర్స్ టెండరింగ్.. ఇదే జగన్ ఏడాది పాలన. పోలవరం పనుల్లో అవినీతి జరిగింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక అవినీతి బయటకు తీస్తానన్నాడు. 2021కల్లా పూర్తి చేస్తానన్న జగన్.. న్యాయపరమైన చిక్కులు కూడా పరిష్కారం చేయలేని అసమర్థత కనిపిస్తుంది. 
 
ఎపి రాజధాని చుట్టూ రెండు పార్టీలు రాజకీయం చేశాయి. జగన్ వచ్చాక మూడు రాజధానుల పేరుతో కొత్త రాజకీయం చేశాడు. విశాఖ భూముల వ్యవహారంలో సిబిసిఐడి వేసినా... అవినీతి నిరూపించక పోవడం అసమర్థత కాదా రాయలసీమలో పెండింగ్ లో ప్రాజెక్టులు కూడా పట్టించుకోలేదు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలి. 
 
టిడిపి హయాంలో ఇసుక, మైనింగ్ దోపిడీ జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారినా దోపిడీ మాత్రం కామన్ అయిపోయింది. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు అనడానికి హైకోర్టు 65 తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి. హైకోర్టుకు కూడా కులాలు, మతాలను అంటగట్టేలా మీ ఎమ్మెల్యేలు, నాయకులు బరితెగించారు. 
 
జగన్మోహన్ రెడ్డి సిఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా.  టిటిడి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని ప్రచారం చేశావు. ఇప్పటికీ ఆ పింక్ డైమండ్ ఏమైందో కనుక్కోలేకపోయారు. డేటా చౌర్యం అన్న జగన్.. వాటిపై చర్యలు లేవు. డేటా చౌర్యం పై  ఇప్పుడు నేను వ్యక్తిగత ఫిర్యాదు చేశాను. 
 
నా మీద హత్యాప్రయత్నం చేశారని అన్న జగన్.. ఆ కేసు ఏమైందో చెప్పాలి. ఇప్పుడు పరిస్థితి చూస్తే... నువ్వే చేయించుకుని.. డ్రామా ఆడావనే అనుమానం కలుగుతుంది. నేను 70కి పైగా ఉత్తరాలు రాస్తే... దున్నపోతు మీద వర్షం పడిన చందంగా స్పందించలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కూడా కులం అంటగట్టి.. ఆర్డినెన్స్ ద్వారా తొలగిస్తారా? 151సీట్లు నీకిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదు.

జగన్ గొప్ప సిఎం కాదు, విఫల సిఎం. ఈ యేడాది పాలన మొత్తం నేను చెప్పిన ఎనిమిది క్యాప్షన్స్ ప్రకారమే నడిచింది. పాలనలో అన్నీ వైఫల్యాలే" అని ధ్వజమెత్తారు.