శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (08:52 IST)

సహజీవనం చేస్తూ పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. దాడి చేసిన ప్రియురాలు.. ఎక్కడ?

గత కొంతకాలంగా సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రియురాలు ప్రియుడిపై దాడికి తెగబడింది. ఆపై తాను కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కృష్ణఆ జిల్లా చల్లపల్లి మండలం, వక్కలగడ్డలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మచిలీపట్నం ఇంగ్లిష్‌పాలేనికి చెందిన యువతి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో పని చేస్తూ వస్తోంది. అయితే, గూడూరుకు చెందిన ఓ యువకుడు పెడన తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఈ యువకుడితో, ఆ యువతికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ వక్కలగడ్డ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేయసాగారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం యువతీయువకులు ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. 
 
కానీ, యువకుడి శరీరంపై కత్తిపోట్లు ఉండడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతీయువకులు ఇద్దరినీ వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వైద్యుల చికిత్స తర్వాత కోలుకున్న యువకుడు జరిగిన విషయాన్ని వెల్లడించారు. 
 
ఆ యువతితో తాను కలిసి సహజీవనం చేస్తున్నామనీ, అయితే, గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగిందన్నారు. మాట్లాడుకుందామంటే గ్రామానికి వచ్చానని, పెళ్లి చేసుకుని కలిసి బతుకుదామని, లేదంటే కలిసి చనిపోదామని చెబుతూ తనపై కత్తితో దాడిచేసిందని వివరించాడు. 
 
ఆ తర్వాత ఆమె కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పుకొచ్చాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, యువతి స్పృహలోకి వస్తేనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.