1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 మే 2020 (07:59 IST)

ప్రేమించినోడు కాదన్నాడనీ.. ప్రియుడి ఇంట్లోనే విద్యార్థిని సూసైడ్.. ఎక్కడ?

పక్కింటి కుర్రోడిపై ఆ ఇంటర్ చదివే విద్యార్థిని మనసుపడింది. అతన్ని గాఢంగా ప్రేమించింది. కానీ, తనది వన్‌సైడ్ లవ్ అనే విషయాన్ని గ్రహించలేకపోయింది. చివరకు తన మనసులోని మాటను ఆ యువకుడికి చెప్పింది. అతను మాత్రం నువ్వంటే నాకిష్టం లేదు అని ముఖాన్నే చెప్పేశాడు. అంతే.. ఆ యువతి మనస్సు విరిగిపోయింది. ఇక తాను జీవించడం వృధా అనుకుని.. ప్రియుడి ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని మూసాపేటలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం యాదవ బస్తీలో ఉంటూ కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. వారి అమ్మాయి (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంటి పక్కనే ఉంటున్న ఓ యువకుడిని (28) ప్రేమించిన ఆమె, తనను పెళ్లి చేసుకోవాలని తరచూ అతన్ని కోరుతూ ఉండగా, వయసులో తేడా అధికంగా ఉందంటూ, అతను తిరస్కరిస్తూ వచ్చాడు.
 
ఈ క్రమంలో శుక్రవారం మరోసారి అతని ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అతను మాత్రం నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని, ఆ యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న వేళ, మరోసారి వెళ్లి, తన చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 
 
యువకుడు నిద్రలేచి చూసి, విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రాథమిక విచారణలో ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె మరణించిందని పోలీసులు తేల్చారు. అయితే అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.