శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 12 మార్చి 2021 (21:29 IST)

రోజాకు నిద్ర లేకుండా చేస్తున్న నేతలు.. ఎవరు?

అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం ఇది. సొంత పార్టీ నేతలపై రోజా ఆగ్రహం సంచలనంగా మారింది. వైసిపిలో వర్గపోరు ఆ రేంజ్‌లో ఉందంటున్నారు విశ్లేషకులు.
 
చిత్తూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల సంధర్భంగా నగరి వైసిపిలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వైసిపి నేత కె.జె.కుమార్ రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రోజా పోలింగ్ కేంద్రం బయటే అధిష్టానానికి లేఖ రాశారు. 
 
రెబల్స్ పైన చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రిని కోరారు రోజా. నిజానికి వైసిపిలో వర్గపోరు కొత్తమాటేం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు ప్రయత్నించారని రోజా ఆరోపణలు చేశారు.
 
రాజకీయంగా తనను అణగదొక్కడానికి ఇదంతా చేస్తున్నారని.. తనను ఒంటరి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న భావన ఆమెలో ఎప్పటినుంచో ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పేచీ పెట్టుకున్నారు రోజా.
 
తరువాత డిప్యూటీ సిఎం నారాయణస్వామితో ఇదే పరిస్థితి. అవకాశం ఉన్నప్పుడల్లా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఇక స్థానిక ఎన్నికల సంధర్భంలో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఈ గొడవకు జరుగుతుండగానే కె.జె.కుమార్ షష్టిపూర్తి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి, నారాయణస్వామిలు హాజరవ్వడాన్ని రోజా అస్సలు జీర్ణించుకోలేకపోయారు.
 
ప్రస్తుతం నగరిలో వైసిపిని ఓడించేందుకు స్వయంగా కె.జె. కుమార్, కె.జె. శాంతిలు రెబల్స్ అభ్యర్థులను బరిలోకి దించడంతో రోజా ఏ మాత్రం జీర్ణించుకులేకపోయారు. పంచాయతీని ప్రస్తుతం ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. ఇది కాస్త రోజాకు నిద్రలేకుండా చేస్తోందట. ఎల్లుండి ఫలితాలు ఎలా వస్తాయోనన్న ఆందోళనలో రోజా ఉన్నారట.