1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (11:45 IST)

మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య.. నవీన్ వల్లే చనిపోతున్నా.. ఎవరు..?

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారామా..? వేధింపులా..? లేక చదువుల ఒత్తిడా..? అనేదానిపై దర్యాప్తు కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే విజయవాడ భవానీపురంకు చెందిన మంగు నాగబాబు, జయలక్ష్మి దంపతుల కుమార్తె దేవి ప్రియాంక. నాగబాబు కొండపల్లిలోని జీ.ఎం.కే ల్యాబ్స్‌లో పనిచేస్తున్నారు. 
 
దేవీ ప్రియాంక గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో ఎండీ సెకండ్ ఇయర్ చదువుతోంది. రోజు మాదిరిగానే కాలేజీకి వెళ్లి ఇంటికొచ్చింది. ప్రియాంక తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురికి ప్రాణముందేమోనన్న ఆశతో వెంటనే 108 కు ఫోన్ చేశారు. కానీ అప్పటికే లాభం లేకపోయింది.
 
అలాగే అక్కడ లభించిన సూసైడ్ నోట్‌లో ప్రియాంక తల్లిదండ్రులకు సారీ చెప్పింది. నవీన్ వల్లే నేను చనిపోతున్నా అని రాసింది. దీంతో వారు భవానీపురం పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
దేవి ప్రియాంక చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్. అందుకే తల్లిదండ్రులు ఆమెకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు. ఈ మధ్య ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నాలుగైద సంబంధాలు తీసుకొచ్చినా ఆమె అంగీకరించలేదు.
 
ఐతే ప్రేమించిన వ్యక్తి గురించి తల్లిదండ్రులను ఒప్పించలేక.. బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్‌లో ఉన్న నవీన్ వ్యక్తి ఎవరు..? ప్రియాంకతో అతడికి ఏం సంబంధం..? అనే అంశాలు మిస్టరీగా మారాయి. దేవి ప్రియాంక ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.