1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 16 సెప్టెంబరు 2021 (10:22 IST)

హ‌త్యాచార నిందితుడిని పొలిటికల్ ఎన్‌కౌంటర్ చేస్తారా?

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఎన్నికల వైపే ఉంది.  ఇక్క‌డ విజ‌యం కోసం రైతు బంధుతో స‌హా ప‌లు ప‌థ‌కాలు తెచ్చిన అధికార పార్టీ టి.ఆర్.ఎస్. ఆఖ‌రిగా వేస్తున్న ప‌థ‌కం... పొలిటిక‌ల్ ఎన్ కౌంట‌ర్. 
 
హుజారాబాద్ ఎన్నికల తేదీ ప్రకటించగానే, ఓ ఎన్ కౌంటర్ జరగనుందా? అందు కోసం హత్యాచార సంఘటనలో నిందితుడిని పట్టుకొని దాచిపెట్టారా? ఆ నిందితుడిని ఎన్ కౌంటర్ చేసి మరో కోణంలో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నది ఎవరు? ఇలా ఎన్నో అనుమానాలు.
 
మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై అత్యాచారం, హత్య జరిగి వారం దాటినా, కనీసం కుటుంబాన్ని కూడా పరామర్శించ లేదు కేటీఆర్. నిందితుడు దొరికాడంటూ ట్విట్ చేసారు. ఈలోగా పోలీసులేమో నిందితుడు కోసం రూ.10 లక్షల రివార్డ్ ప్ర‌క‌టించారు. మంత్రి కేటీఆర్... సారీ అంటూ మరో ట్విట్ చేశారు. 
 
ఈ మొత్తం ఉదంతంసై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి త‌న అనుమానం బయటపెట్టారు. పోలీసులు హత్యాచార నిందితుడిని దాచిపెట్టార‌నేది ఆ అనుమానం. దొరికినట్లు కేటీఆర్ 12వ తేదీ ట్విట్ చెపుతుంది. ఏ పోలీసు అధికారి ధైర్యం చేసి మంత్రికి తప్పుడు సమాచారం ఇవ్వ‌డు. ఆ నిందితుడిని ఎన్ కౌంటర్ చేసి హుజురాబాద్ ఎన్నికల్లో 'లాభం పొందే అవకాశాన్ని కొట్టి పడేయలేం' అంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తన ట్విట్లో అనుమానం వ్యక్తం చేశారు.

మొదట కేటీఆర్ నిందితుడిని పట్టుకున్నట్లు ట్వీట్ చేసి, ఆపై కథను మార్చారని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఎన్ కౌంటర్ చేస్తే, నిజాన్ని ఎన్ కౌంటర్ చేసినట్లేనని, ఇది తాలిబన్ల రాజ్యం కాదని, ఇప్పటికే దిశ కేసులో పోలీసులు చేసిన పనికి, మానవ హక్కుల కమిషన్ చుట్టూ తిరుగుతున్న విషయం ఆయన గుర్తు చేశారు. పోలీసులను స్వచ్ఛందగా పని చేయనివ్వాలని, రాజకీయ వత్తిళ్ళు తేవద్దని ఆయన హితవు పలికారు.
 
ఈ కేసులో నిందితుడికి సంబంధించిన ఆధారాలు సేకరించడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. నిందితుడి డిఎన్ఏ, నేరానికి సంబంధించిన ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించక లేకపోయినట్లు ఆయన ఆరోపించారు.
 
కల్వకుంట్ల కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి అత్యంత సన్నిహితుడు. ఏదైనా సంఘటన జరిగిన సందర్భంలో సహజంగానే విరుచుకుపడే మంత్రి మల్లారెడ్డి, నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తామని చెప్పారు. అంటే, అత‌డు దొర‌క‌కుండానే ఇవ‌న్నీ ఎలా చెప్పేస్తార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.