శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (14:44 IST)

పిల్లల నైతిక స్థైర్యాన్ని పెంచేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలి : నాగబాబు

పిల్లల నైతిక స్థైర్యాన్ని పెంచేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలని నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన తర్వాత కొందరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇవి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. 
 
వీటిపై నాగబాబు స్పందిస్తూ, విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న కారణంగానే ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యల బాట పడుతున్నారన్నారు. ఫెయిలైనవాడు ఎందుకూ పనికిరాడంటూ ఓ పరమచెత్త పరిస్థితి సృష్టిస్తున్నారని, పిల్లలు ఆ ఒత్తిడికే బలవుతున్నారంటూ మండిపడ్డారు. తమ కుటుంబంలో అలాంటి పరిస్థితి లేదని నాగబాబు గర్వంగా చెప్పారు.
 
'మా నాన్న అది చదవమని. ఇది చదవమని ఏనాడూ ఎవరినీ ఒత్తిడి చేయలేదు. బాగా చదువుతున్నారా? లేదా? అని మాత్రమే మా అమ్మ అడుగుతుండేది. ఫలానా చదువే చదవాలని వాళ్లెప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. అందుకే అన్నయ్య డిగ్రీ చదివారు. నేను నాకెంతో ఇష్టమైన ఎల్ఎల్‌బీ చదివాను. మా ఇద్దరు చెల్లెళ్లలో ఒకరు ఎంబీబీఎస్ చేయగా మరొకరు డిగ్రీ పూర్తి చేశారు. ఇక, కల్యాణ్ బాబు ఇంటర్ తర్వాత ఐటీ డిగ్రీ చేశాడు' అంటూ చెప్పుకొచ్చాడు. 
 
పైగా, మా ఇంట్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేదన్నారు. 'పదో తరగతిలో మ్యాథ్స్ పరీక్ష సరిగా రాయకపోవడంతో ఫెయిల్ అవుతానని భయం పట్టుకుంది. అదే విషయం మా నాన్నతో చెబితే, పాసైతే రూ.100 ఇస్తాను, ఫెయిలైతే రూ.500 ఇస్తాను అని చెప్పారు. రిజల్ట్ గురించి టెన్షన్ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు అని ఆయన తన మాటలతో చెప్పారు' అని చెప్పారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతికపరమైన బోధ చేయాలే తప్ప, ఒత్తిడికి లోను చేసేలా ప్రవర్తించరాదని నాగబాబు హితవు పలికారు.