గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (15:13 IST)

రక్తసిక్తమైన బుద్ధుని గడ్డ : ఎల్టీటీఈ స్థానంలో ఎన్.టి.జె

ఎల్టీటీఈ తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టిన తర్వాత ప్రశాంత వాతావరణం, జీవనానికి మారుపేరుగా ఉన్న శ్రీలంక (బుద్ధుని గడ్డ) రక్తసిక్తమైంది. ఈస్టర్ సండే రోజున ఆత్మాహుతి దాడులతో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. ఈ ఉగ్రదాడిలో దాదాపుగా 185 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 
 
అయితే, ఎల్టీటీఈ తీవ్రవాదంలో శ్రీలంక అట్టుడుకిపోయింది. ఆ తర్వాత భారత సహకారంతో శ్రీలంక ప్రభుత్వం ఎల్టీటీఈ తీవ్రవాదులను పూర్తిగా ఏరివేసింది. ఆ సంస్థ అధిపతి ప్రభాకరన్‌ను హతమార్చింది. అప్పటినుంచి ప్రశాంత వాతావణం నెలకొంది. 
 
అయితే, గతేడాది దేశవ్యాప్తంగా బుద్ధ విగ్రహాలు నేలకూల్చి కలకలం రేపిందో సంస్థ. దాని పేరు నేషనల్ తోహీత్ జమాత్ (ఎన్ టీ జే). అప్పుడా సంస్థను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఏదో నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు మాత్రమే పరిమితం అని తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడా నిర్లక్ష్యమే శ్రీలంక రాజధాని కొలంబోలో నెత్తుటేరులు పారడానికి కారణమైందని నిపుణులు అంటున్నారు. 
 
ఈనెల 11వ తేదీన శ్రీలంక పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందరకు దాడుల విషయమై ముందస్తు సమాచారం అందింది. ఎన్.టీ.జే అనే ముస్లిం అతివాద సంస్థ దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు తెగబడేందుకు సిద్ధంగా ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించింది. ప్రధానంగా చర్చిలు, శ్రీలంకలో భారత హైకమిషన్ కార్యాలయం, నక్షత్ర హోటల్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడవచ్చని తెలిపింది. కానీ, శ్రీలంక ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. 
 
ఫలితంగా శ్రీలంకలో ఉగ్ర సంస్థ మారణహోమం సృష్టించింది. మొత్తం 8 చోట్ల పేలుళ్ళు జరిగాయి. వీటిలో ఆరు చోట్ల బాంబు పేలుళ్లు, రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి. చర్చిలు, స్టార్ హోటల్స్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడ్డారు. దీనిపై, శ్రీలంకలో హైలెవల్ ఇంటలిజెన్స్ మీటింగ్ కూడా నిర్వహించారు. కానీ, ఈస్టర్ పండుగనాడే ముష్కరులు పంజా విసరడంతో కొలంబో రక్తసిక్తమైంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 156 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే, దాడులకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.