1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (12:47 IST)

ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉంది : నారా బ్రాహ్మణి

nara brahmani
మహిళలను ఇంటికి దీపం ఇల్లాలు అంటారని, చక్కదిద్దడం, సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్థాంగి నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె మంగళగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. తన భర్త నారా లోకేశ్ తరపున ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. విస్తృతంగా పర్యటిస్తూ, వివిధ వర్గాలతో భేటీ అవుతూ లోకేశ్‌కు మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. తాజాగా, తాడేపల్లి రూరల్ నులకపేట చైతన్య తపోవన కల్యాణ మండపంలో స్త్రీ శక్తి లబ్ధిదారులు, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఎన్టీఆర్ మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఎన్టీఆర్ అధికారంలోకిరాగానే రాజకీయాల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాలు, కళాశాలల్లో యువతులకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. మహిళల పేరిట ఇళ్ల స్థలాలు, పట్టాలు, రుణాలిచ్చారు. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించేలా ద్వాక్రా సంఘాలను నెలకొల్పి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. దీపం పథకంతో 65 లక్షల గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేస్తున్న లోకేశ్.. ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని చేస్తారో ప్రజలు ఆలోచించాలి. 
 
లోకేశ్ మనసుకు దగ్గరైన పథకం స్త్రీ శక్తి. ఈ పథకాన్ని ఒక్క మంగళగిరిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని లోకేశ్ భావిస్తున్నారు. మంగళగిరిలో స్త్రీ శక్తి, పెళ్లికానుకలు, ఎన్టీఆర్ సంజీవని వంటి 29 పథకాలను అమలు చేస్తున్నారు. మా పెళ్లయిన తర్వాత ఉన్నత విద్య అభ్యసించేందుకు లోకేశ్ అందించిన ప్రోత్సాహం మరువలేనిది. నేను చదువు నిమిత్తం రెండుసార్లు అమెరికా వెళ్లానంటే అందుకు లోకేశ్ ప్రోత్సాహమే కారణం. నన్ను ప్రోత్సహించినట్టే మంగళగిరి నియోజకవర్గంలోని ప్రతి మహిళ వారి సొంత కాళ్లపై నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా 2,600 మంది టైలరింగ్ నేర్చుకుని ఉపాధి పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థిక స్వావలంబనకు మరిన్ని పదకాలు రూపొందించి అమలు చేసాం అని ఆమె తెలిపారు.