1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:22 IST)

నెల్లూరు దంపతుల హత్య కేసులో హోటల్ సప్లయరే హంతకుడు

krishnarao couples
ఇటీవల జిల్లా కేంద్రమైన నెల్లూరులో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యలు నెల్లూరు పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ కేసులో హంతకులను పోలీసులు గుర్తించారు. మృతుడైన హోటల్ యజమాని హోటల్‌లో పని చేసే సప్లయరే ఈ హత్యకు పాల్పడినట్టు తేల్చారు. ఈ సప్లయర్‌కు మృతుడు బంధువు ఒకరు తన వంతు సహకారం అందించారు.
 
నెల్లూరు పట్టణానికి చెందిన కృష్ణారావు (54), సునీత (50) అనే దంపతులు ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటరులో కృష్ణారావు హోటల్ నడుపుతున్నారు. ఈ నెల 27వ తేదీన అర్థరాత్రి సమయంలో కృష్ణారావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. 
 
మరుసటి రోజు ఉదయం పాలు పోసేందుకు వచ్చిన రమణమ్మ అనే మహిళ కృష్ణారావు మృతదేహాన్ని చూసేంత వరకు ఈ హత్య కేసు వెలుగులోకి రాలేదు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేస విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు వాస్తవం తెలిసింది. 
 
కృష్ణారావు హోటల్‌లో సప్లయర్‌గా పని చేసే శివ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. దీనికి కారణం శివను నలుగురు ముందు కృష్ణారావు దూషించడమే. దీంతో పగతో రగిలిపోయిన శివ... కృష్ణారావును పగతీర్చుకోవడంతో పాటు డబ్బు కోసం కృష్ణారావు, ఆయన భార్య సునీతను హత్య చేశాడు. 
 
శివకు కృష్ణారావు బంధువు రామకృష్ణ తన వంతు సహకారం అందించారు. శివ, రామకృష్ణలు కలిసి కృష్ణారావు గొంతు కోశారు. ఆ తర్వాత నిద్రిస్తున్న సునీత తలపై బలంగా కొట్టి చంపేశారు. ఆపై ఇంటిలోని రూ.1.60 లక్షల నగదును ఎత్తుకెళ్లిపోయారు. డబ్బు ఆశతోనే శివకు రామకృష్ణ సహకారం అందించారు. హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా వారి అంత్యక్రియల్లో కూడా ఈ నిందితులు పాల్గొన్నట్టు జిల్లా ఎస్పీ విజయరావు వివరించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, 15 రోజుల్లో చార్జిషీటు దాఖలుచేస్తామని తెలిపారు.